Dailyhunt
ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలి: జూకంటి పౌలు

ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలి: జూకంటి పౌలు

వతెలంగాణ - ఆలేరు రూరల్ఉపాధి కూలీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌలు డిమాండ్ చేశారు. ఆలేరు మండలంలోని కంది గడ్డ తండాలో ఉపాధి హామీ పనుల్లో పనిచేస్తున్న కూలీల సమస్యలను సంఘం నాయకులు పరిశీలించారు.

ఈ సందర్భంగా జూకంటి పౌలు మాట్లాడుతూ, ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరచే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తీవ్రంగా విమర్శించారు. కూలీలను పనుల నుండి దూరం చేయడానికి కొత్త విధానాలను అమలు చేస్తున్నారని ఆరోపించారు. డ్రోన్ యంత్రాల ద్వారా కూలీలపై నిఘా పెట్టడం, కేవీసీ విధానం పేరుతో ఉదయం, సాయంత్రం రెండు సార్లు ఫోటోలు తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తేనే వేతనాలు చెల్లిస్తామని నిబంధనలు పెట్టడం వల్ల కూలీలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వారానికి వేతనాలు చెల్లించకపోవడం, కొత్త జాబ్ కార్డులు ఇవ్వకపోవడం, పని అడిగినా పని చూపకపోవడం వంటి సమస్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

అలాగే పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ కోసం టెంట్లు, మెడికల్ కిట్లు వంటి కనీస సౌకర్యాలు లేకపోవడం, పనిముట్లు అందించకపోవడం,ప్రమాదాలు జరిగితే సహాయం అందకపోవడం వంటి సమస్యలను కూలీలు వెల్లడించారని చెప్పారు. పేదలపై భారం మోపే విధానాలను కేంద్ర ప్రభుత్వం విరమించి,ఉపాధి హామీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు బొమ్మకంటి లక్ష్మీనారాయణ,మండల కమిటీ సభ్యురాలు కేతవత్ లక్ష్మి, మాలోతు దేశ, సునీత, లక్ష్మి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana