తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2వ తేదీన హైదరాబాద్ వేదికగా జనసేన పార్టీ కీలకమైన సమావేశాన్ని నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ ప్రతిష్టాత్మక మీటింగ్కు హాజరుకానుండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ సమావేశంలో ఆయన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ ముఖ్య నాయకులు, క్రియాశీలక కార్యకర్తలను ఉద్దేశించి దిశా నిర్దేశం చేయనున్నారు.
ఏపీలో అధికారంలో భాగస్వామిగా ఉంటూనే, అటు తెలంగాణలో కూడా జనసేన జెండాను బలంగా పాతాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడే ఈ భేటీని ఏర్పాటు చేయడం ద్వారా అటు తెలంగాణ సెంటిమెంట్ను గౌరవిస్తూనే, ఇటు పార్టీ శ్రేణుల్లో సరికొత్త పొలిటికల్ జోష్ నింపాలని జనసేన హైకమాండ్ భావిస్తోంది.
పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో నిర్వహిస్తోన్న మొదటి పెద్ద పొలిటికల్ మీటింగ్ ఇదే కావడంతో, ఈ సమావేశం ద్వారా ఆయన ఎలాంటి సంచలన ప్రకటనలు చేస్తారోనని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

