తిరుపతిలోని స్పెషల్ సబ్ జైల్లో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈరోజు(సోమవారం) ఉదయం సబ్ జైల్కు వెళ్లిన మంత్రి జైలులో ఖైదీలకు కల్పిస్తున్న వసతులను గురించి జైల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం హోం మంత్రి మాట్లాడుతూ ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకురావడం కోసమే జైళ్లు అని చెప్పుకొచ్చారు.
ఖైదీల భద్రత తమ బాధ్యత అని.. ఖైదీల్లో కూడా పరివర్తన రావాలని హోంమంత్రి అన్నారు. రాష్ట్రంలో సంచలనమైన కేసులను త్వరితగతిన విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పనిచేస్తున్నాయన్నారు.
అవసరమైతే మరిన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.
జైళ్ల శాఖలో ప్రక్షాళన చేపడతామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ద్వారా పోలీసు, ఫైర్, జైల్ శాఖల్లో ఖాళీలు భర్తీ చేస్తున్నామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.
వేసవికాలంలో అగ్నిప్రమాదాల నివారణపై దృష్టి పెట్టాం. వైసీపీ హయాంలో ఒక్క ఫైరింజన్ కొనుగోలు చేయలేదు కూటమి ప్రభుత్వం అగ్నిమాపకశాఖకు రూ.270 కోట్లు కేటాయించింది అన్నారు.
అధునాతన ఫైరింజన్లు, సామాగ్రి కొనుగోలు చేశాం అని హోంమంత్రి అనిత తెలిపారు.

