పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తమ ప్రభుత్వానికి పూర్తి చిత్తశుద్ధి ఉందని, నిర్వాసితుల సంక్షేమం పట్ల ప్రత్యేక అభిమానంతో ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
పుట్టపర్తి పర్యటన ముగించుకుని అమరావతి వచ్చిన ఆయన, శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా నిర్వాసితులకు నాలుగో విడతగా రూ.306.61 కోట్ల పరిహారం, పునరావాస (ఆర్ అండ్ ఆర్) ప్యాకేజీని అందించారు. పలువురు లబ్ధిదారులకు ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో నిర్మించిన ఇళ్ల తాళాలను అందజేశారు.
సర్ ఆర్థర్ కాటన్ జయంతి రోజున నిర్వాసితులకు పరిహారం అందించడం సంతోషంగా ఉందని సీఎం అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 23 నెలల్లో 29,936 మంది నిర్వాసితులకు సుమారు రూ.2,250 కోట్లు చెల్లించామని గుర్తుచేశారు.
“ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులు నష్టపోకూడదనేదే నా ఆలోచన. అందుకే ప్రత్యేకంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేశాం.
2027లో జరిగే పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం” అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
నిర్వాసితుల్లో ఒక్కరికి కూడా అన్యాయం జరగనివ్వను” అని భరోసా ఇచ్చారు. టెక్నాలజీని ఉపయోగించి గిరిజన ప్రాంతాల్లో ప్రతి కుటుంబ ఆదాయం పెంచుతామని, రంపచోడవరం, పోలవరం నియోజకవర్గాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, మిరియాల శిరీషా దేవి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

