రైతులను ఇబ్బంది పెడితే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, కంపెనీలపై కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర సచివాలయంలో ఖరీఫ్-2026 ఎరువుల లభ్యత, పంపిణీపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
వ్యవసాయశాఖ అధికారులు, ఎరువుల కంపెనీ, ఆసోషియేషన్ సభ్యులతో సమావేశమయ్యారు. యూరియా, డీఏపీతో కాంప్లెక్స్ ఎరువుల బలవంతపు విక్రయాలు ఆపాలన్నారు. రైతులకు అవసరమైన ఎరువులనే అందించాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో అవసరమైన మేర కన్నా అధిక ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని మంత్రి చెప్పారు.
యూరియా సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎరువుల బుకింగ్ యాప్ నిర్వహణ సజావుగా ఉండాలన్నారు.
నానో యూరియా ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సహజ వ్యవసాయంపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోందని తెలిపారు.
సాధ్యమైనంత మేర రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలని, అధిక ఎరువుల వినియోగంపై రైతులు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు.
ఎమ్ఆర్పీ ధరకే యూరియాను విక్రయించాలని, ఎమ్ఆర్పీకి మించి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని డీలర్లకు మంత్రి హెచ్చరిక జారీ చేశారు.
యూరియా పక్కదారి పట్టకుండా ప్రత్యేక విజిలెన్స్ బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఎరువుల బస్తాకు పూర్తి లెక్క ఉండాలన్నారు.
గతంలా అక్రమాలు, ఇబ్బందులు సృష్టిస్తే ఉపేక్షించమని, రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

