షావుకారు జానకిగారితో మా అనుబంధం – నందమూరి బాలకృష్ణ
"మహానటి షావుకారు జానకిగారు తుదిశ్వాస విడిచారన్న వార్త తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యాను.
జానకిగారితో మా నందమూరి కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది.
నాన్నగారు హీరోగా నటించిన తొలి చిత్రం ‘షావుకారు’తోనే ఆమె ‘షావుకారు జానకి’గా సుప్రసిద్ధులయ్యారు. అలా నాన్నగారికి జానకిగారు తొలి హీరోయిన్, అలాగే ఆమె తొలి కథానాయకుడు ఆయన.
నాన్నగారితో అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు జానకిగారు. మా యన్.ఏ.టి. బ్యానర్ లో రూపొందిన తొలి చిత్రం ‘పిచ్చిపుల్లయ్య’లో ఆమె కీలక పాత్ర ధరించారు.
‘పాండురంగ మహాత్మ్యం’ నుంచీ యన్.ఏ.టి. బ్యానర్ లోగోలో శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహానికి కుడివైపున జానకిగారు కూర్చుని తెరపై కనిపించడం విశేషం.
నేను ‘తాతమ్మకల’లో మహానటి భానుమతి మునిమనవడిగా నటిస్తూ పరిచయమయ్యాను. ఆ తరువాత “రామ్ – రహీమ్, వేములవాడ భీమకవి” చిత్రాల్లో షావుకారు జానకిగారితో నటించే అదృష్టం నాకు కలిగింది.
మన దేశ సినిమా చరిత్రలో 75 ఏళ్ళ సుదీర్ఘ నటనాప్రస్థానం కలిగిన ఆర్టిస్ట్ షావుకారు జానకిగారు ఒక్కరే . అంతటి సుదీర్ఘ నటనాజీవితంలో ఎన్నెన్నో మరపురాని పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు జానకిగారు.
ఆ మహానటి మరణం నాకు వ్యక్తిగతంగా తీరనిలోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను." అని నందమూరి బాలకృష్ణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు

