తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి గరిష్ఠ వయోపరిమితిని మరో పదేళ్ల పాటు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం సాధారణ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ఠ వయోపరిమితి 34 ఏళ్లుగా ఉంది.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇది ఇప్పుడు 44 ఏళ్లకు పెరిగింది. ఈ అదనపు వయో సడలింపు నిబంధన ఏడాది పాటు రానున్న అన్ని నోటిఫికేషన్లకు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
రాష్ట్రంలోని వివిధ నియామక సంస్థలు జారీ చేసే అన్ని రకాల జనరల్ ఉద్యోగాల నోటిఫికేషన్లకు ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది.
అయితే శారీరక దారుఢ్య ప్రమాణాలు అవసరమైన యూనిఫాం సర్వీసులకు మాత్రం ఈ సడలింపు వర్తించదు.
పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, అటవీ శాఖల ఉద్యోగాలకు పాత నిబంధనలే కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

