అమరావతి: వైఎస్సార్సీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఛిన్నాభిన్నమైందని, గత ప్రభుత్వ పాలనా లోపాల వల్ల రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆయన బుధవారం సమగ్ర శ్వేతపత్రాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, 2019-24 మధ్యకాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తుల (GSDP) వృద్ధి రేటు గణనీయంగా పడిపోయిందని, దీనివల్ల రూ. 6.94 లక్షల కోట్లకు పైగా ఆర్థిక నష్టం జరిగిందని తెలిపారు. గతంలో ఉన్న 13.5 శాతం వృద్ధి రేటు అలాగే కొనసాగి ఉంటే రాష్ట్రానికి అదనంగా రూ. 76,000 కోట్ల రెవెన్యూ సమకూరేదని గణాంకాలతో సహా వివరించారు. ప్రభుత్వం మారితే ఎంతటి విధ్వంసం జరుగుతుందో చెప్పేందుకు గత ఐదేళ్ల పాలనే నిదర్శనమని మండిపడ్డారు.
గత ప్రభుత్వం నిర్వాకం వల్ల 'బ్రాండ్ ఆంధ్రా' తీవ్రంగా దెబ్బతిందని, 2024-26 రెండేళ్లకు కావలసిన నిధులను కూడా ముందే వాడేసి భవిష్యత్తును అంధకారం చేశారని విమర్శించారు. "మా ఊర్లో అడవి పందులు పంటను తినడమే కాకుండా మొత్తం తొక్కేసి నాశనం చేస్తాయి.. గత పాలకులు కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అంతకంటే దారుణంగా నాశనం చేశారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమం, సుపరిపాలనతోనే ప్రజల జీవితాల్లో వెలుగులు నింపగలమని, రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని సీఎం స్పష్టం చేశారు.

