Dailyhunt
ALERT.. నేటి నుంచి 3 రోజులు పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. పిడుగులు పడే ఛాన్స్!

ALERT.. నేటి నుంచి 3 రోజులు పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. పిడుగులు పడే ఛాన్స్!

తెలంగాణలో నేటి నుంచి 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రోజు జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు పడుతాయని తెలిపింది.

మూడు రోజుల తర్వాత గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా స్పష్టం చేసింది వాతావరణ శాఖ. ఈ నెల 10వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.

అటు ఏపీలో నేడు, రేపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడుతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రా జిల్లాల్లో వర్షాలు పడతాయని వివరించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో మంగళవారం (07-04-26) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తూర్పుగోదావరి(జి) లక్ష్మీపురంలో 57.5మిమీ, శ్రీకాకుళం (జి) ఎచ్చెర్లలో 52.5మిమీ అధిక వర్షపాతం నమోదైందని తెలిపారు. అలాగే నేడు నెల్లూరు జిల్లా మనుబోలు, చిల్లకూరు, గుడూరు మండలాలు, తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిక, దొరవారిసత్రం, నాయుడుపేట, ఓజిలి, పెళ్ళకూరు మండలాల్లో వడగాలులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత చూపే అవకాశం ఉందన్నారు.

సోమవారం అనంతపురం(జి) తెరన్నపల్లిలో 42°C, కడప (జి) రాజుపాలెంలో 41.9°C, మార్కాపురం(జి) నందన మారెళ్లలో 40.7°C నంద్యాల(జి) పేరుసోమలలో 40.6°C, నెల్లూరు (జి) వరికుంటపాడులో 40.3°C గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu