Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత విద్యార్థులకు ట్రంప్‌ ప్రభుత్వం షాక్‌!

భారత విద్యార్థులకు ట్రంప్‌ ప్రభుత్వం షాక్‌!

మెరికాలో చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం చేయాలనుకునే విదేశీ విద్యార్థులకు భవిష్యత్తులో ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. అమెరికాలో చదువు, ఆ తర్వాత విలువైన పని అనుభవం సంపాదించాలనే లక్ష్యంతో వెళ్లే అంతర్జాతీయ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ గ్రాడ్యుయేట్లపై ఏకంగా 100,000 డాలర్ల (సుమారు రూ. 95 లక్షలు) భారీగా ఫీజు విధించే ప్రతిపాదనను డొనాల్డ్ ట్రంప్ యంత్రాగలం పరిశీలిస్తోంది. అలాగే, ప్రభుత్వ అనుమతి లేకుండా విద్యార్థులు దేశంలో ఎంతకాలం ఉండవచ్చో పరిమితం చేస్తూ వీసా నిబంధనలను కఠినతరం చేస్తోంది.

ఈ మార్పులు కనుక అమలైతే, గత కొన్ని సంవత్సరాలలో యూఎస్ స్టూడెంట్ వీసా వ్యవస్థలో వస్తున్న అత్యంత భారీ మార్పులలో ఇవి నిలుస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఇది అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో ఎంతకాలం ఉండగలరు, గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగం చేయడానికి ఎంత ఖర్చు చేయాల్సి వస్తుంది అనే దానిపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

100,000 డాలర్ల ప్రతిపాదన ఏమిటి?

వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, ఈ ప్రతిపాదిత ఫీజు 'ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్' (OPT) ప్రోగ్రామ్‌కు వర్తిస్తుంది. కాలేజీ విద్యకు, అమెరికాలో మొదటి ఉద్యోగానికి మధ్య వారధిగా ఈ OPT ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఎఫ్-1 వీసాలపై చదువుతున్న చాలా మంది అంతర్జాతీయ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత తమ చదువుకున్న రంగంలో ఒక సంవత్సరం వరకు పనిచేయవచ్చు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు సాధారణంగా మూడేళ్ల వరకు పనిచేసే అవకాశం ఉంది. ఈ సమయం విద్యార్థులకు పని అనుభవాన్ని సంపాదించడానికి, కెరీర్‌ను నిర్మించుకోవడానికి మరియు హెచ్-1బీ (H-1B) వర్క్ వీసాకు మారడానికి సహాయపడుతుంది. ఇప్పుడు ట్రంప్ యంత్రాగం ఈ అవకాశానికి 100,000 డాలర్ల ధరను జోడించాలని ఆలోచిస్తోంది.

ఈ ప్రతిపాదనపై హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ (DHS)లో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. దీనిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ ఫీజును విద్యార్థులే స్వయంగా చెల్లించాలా లేక వారిని నియమించుకునే కంపెనీలు చెల్లించాలా అనే దానిపై కూడా అధికారుల నుంచి స్పష్టత రాలేదు. అయినప్పటికీ, ఇది ఆమోదం పొందితే అమెరికాలో ఉద్యోగాలు కోరుకునే అంతర్జాతీయ గ్రాడ్యుయేట్లకు ఎదురయ్యే అతిపెద్ద ఆర్థిక అవరోధాలలో ఇదొకటిగా మారుతుంది.

ఇది ఎందుకు ముఖ్యం?

చాలా మంది విద్యార్థులకు అమెరికాలో చదువుకోవడం అంటే కేవలం డిగ్రీ సంపాదించడం మాత్రమే కాదు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగం చేసే అవకాశం ఉండబట్టే కుటుంబాలు లక్షలు, కొన్నిసార్లు కోట్లు వెచ్చించి అమెరికాలో చదివిస్తున్నాయి. OPT ద్వారా పనిచేయడం వల్ల గ్రాడ్యుయేట్లు తమ పెట్టుబడిలో కొంత భాగం తిరిగి సంపాదించుకోవడానికి, అంతర్జాతీయ అనుభవాన్ని పొందడానికి, దీర్ఘకాలిక ఉద్యోగం సాధించే అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి వీలవుతుంది.

ఒకవేళ 100,000 డాలర్ల ఫీజు అమలైతే, అంతర్జాతీయ గ్రాడ్యుయేట్లను నియమించుకునే ముందు కంపెనీలు రెండుసార్లు ఆలోచించేలా చేస్తుంది. కంపెనీలే ఈ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తే, అవి విదేశీయులకు బదులుగా అమెరికన్ అభ్యర్థులకే ప్రాధాన్యత ఇవ్వవచ్చు. ఒకవేళ విద్యార్థులే స్వయంగా చెల్లించాల్సి వస్తే, చాలా మంది ఆ మొత్తాన్ని భరించలేకపోవచ్చు. అందుకే ఈ ప్రతిపాదన అమెరికాను అంతర్జాతీయ విద్యార్థులకు అంతగా ఆకర్షణీయంగా మార్చదని విశ్వవిద్యాలయాలు, విద్యా నిపుణులు భావిస్తున్నారు. 2024లో సుమారు 4,19,000 మంది అంతర్జాతీయ గ్రాడ్యుయేట్లు OPT ప్రోగ్రామ్ కింద పనిచేశారు.

మరో కీలకమైన మార్పు..

ఈ OPT ఫీజు ప్రతిపాదనతో పాటు విద్యార్థులు గమనించాల్సిన మరో పెద్ద మార్పు కూడా ఉంది. విద్యార్థులు చదువుతున్న సమయంలో అమెరికాలో ఎంతకాలం ఉండవచ్చనే నిబంధనను మారుస్తూ యూఎస్ ప్రభుత్వం ఒక నిబంధనను ఖరారు చేసింది. దశాబ్దాలుగా విద్యార్థులు "వ్యవధి స్థితి" (duration of status) అనే వ్యవస్థ కింద అమెరికాలోకి ప్రవేశించారు.

సాధారణ మాటల్లో చెప్పాలంటే, మీరు పూర్తికాలపు విద్యార్థిగా ఉండి, మీ వీసా నిబంధనలను పాటిస్తున్నంత కాలం దేశంలో ఉండవచ్చు. మీ బసకు నిర్దిష్టమైన ముగింపు తేదీ ఉండేది కాదు. అయితే, ఇప్పుడు ఆ వ్యవస్థ ముగియనుంది. కొత్త నిబంధన ప్రకారం, చాలా మంది అంతర్జాతీయ విద్యార్థులకు అమెరికాలో గరిష్టంగా నాలుగేళ్ల వరకు ఉండేందుకు అనుమతి లభిస్తుంది. మీ డిగ్రీ, పీహెచ్‌డీ, వైద్య కోర్సు లేదా పరిశోధన అంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటే, మీరు స్వయంచాలకంగా దేశంలో ఉండేందుకు అనుమతి ఉండదు. బదులుగా, మీ అధికారిక బస గడువు ముగిసేలోపు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌కు పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇదే నిబంధన అమెరికాలో పనిచేస్తున్న ఎక్స్ఛేంజ్ విజిటర్లు, విదేశీ జర్నలిస్టులకు కూడా వర్తిస్తుంది. అయితే ఈ నిబంధన అధికారికంగా అమల్లోకి రావడానికి ముందు కాంగ్రెస్ ఆమోదం పొందాల్సి ఉంది.

ఈ మార్పులకు కారణం ఏమిటి?

ఇమ్మిగ్రేషన్ వ్యవస్థపై పర్యవేక్షణను బలోపేతం చేయడానికి, జాతీయ భద్రతను మెరుగుపరచడానికి ఈ కొత్త చర్యలు దోహదపడతాయని ట్రంప్ యంత్రాగం చెబుతోంది. చట్టపరమైన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ సమగ్రతను పరిరక్షించడానికి అన్ని మార్గాలను ఎలా ఉపయోగించాలనే దానిపై DHS ఎప్పుడూ చర్చిస్తూనే ఉంటుందని ఒక ప్రతినిధి తెలిపారు. గత సంవత్సరంలో కఠినమైన వీసా తనిఖీలు, హెచ్-1బీ వీసా వ్యవస్థలో మార్పులతో సహా పలు ఇమ్మిగ్రేషన్ చర్యలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

భారతీయ విద్యార్థులపై ప్రభావం:

అమెరికాలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులలో భారతీయ విద్యార్థులు అత్యధికంగా ఉన్నారు. ప్రస్తుతం 3.3 లక్షలకు పైగా భారతీయ విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు. అమెరికాలో చదువుకోవాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి ఈ తాజా ప్రతిపాదనలు తక్షణమే తమ ప్రణాళికలను మార్చుకోవాలని అర్థం కాదు. 100,000 డాలర్ల OPT ఫీజు అనేది ఇంకా ప్రతిపాదన మాత్రమే, కొత్త నాలుగేళ్ల వీసా నిబంధన కూడా ఇంకా అమలోకి రాలేదు.

అయినప్పటికీ, అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానం ఏ దిశగా వెళ్తుందనేది స్పష్టమవుతోంది. అమెరికన్ డిగ్రీ సంపాదించి అక్కడ కెరీర్ నిర్మించుకునే మార్గం రాబోయే రోజుల్లో మరింత ఖరీదైనదిగా, మరింత కఠినమైనదిగా మారే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu