ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా (స్వయం సహాయక సంఘాల) మహిళల ఆర్థిక స్వావలంబన, స్వయం ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ బ్రాండ్లు అయిన నేటివ్ అరకు కాఫీ, చాయ్ రస్తా, గాటోస్ కేఫ్ వంటి సంస్థలతో కీలక ఒప్పందం చేసుకుంది.
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా), గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) భాగస్వామ్యంతో ఇప్పటివరకు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఈ కేఫ్ సెంటర్ల నెట్వర్క్ను ఇకపై గ్రామీణ ప్రాంతాలకు, ప్రధాన రహదారుల కూడళ్లకు విస్తరించనున్నారు.
ఈ ప్రాజెక్టు కింద ఒక్కో కేఫ్ యూనిట్ ఏర్పాటుకు సుమారు రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపే మహిళా పారిశ్రామికవేత్తలకు బ్యాంకుల ద్వారా అవసరమైన రుణ సదుపాయాన్ని ప్రభుత్వమే స్వయంగా కల్పిస్తుంది.
అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP) పథకంతో ఈ ప్రాజెక్టును అనుసంధానించడం ద్వారా కేఫ్ ఏర్పాటుకు అవసరమైన ఆధునిక యంత్రాలు, ఇతర పరికరాల కొనుగోలుపై గరిష్టంగా 35 శాతం వరకు సబ్సిడీని అందించనున్నారు. ఎంపిక చేసిన మహిళలకు ఆయా భాగస్వామ్య సంస్థల ద్వారా నాణ్యతా ప్రమాణాలు, కస్టమర్ సర్వీస్, బిజినెస్ నిర్వహణలో ప్రత్యేక వృత్తిపరమైన శిక్షణ కూడా ఇవ్వనున్నారు.

