ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో భాగంగా స్కూళ్లలో అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యే విద్యార్థులకు, ఆడుకుంటూ గాయపడే పిల్లలకు తక్షణమే వైద్యం అందించేందుకు 'సిక్ రూమ్ల' ను అందుబాటులోకి తీసుకువస్తోంది.
సమగ్రశిక్ష అధికారుల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన పీఎంశ్రీ పాఠశాలల్లో ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
రాష్ట్రంలోని మొత్తం 629 పీఎంశ్రీ పాఠశాలల్లో ఈ సిక్ రూమ్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కోసం ఒక్కో పాఠశాలకు రూ. 5 లక్షల చొప్పున మొత్తం సుమారు రూ. 30 కోట్ల బడ్జెట్ను ప్రభుత్వం కేటాయించింది. పాఠశాలలోని ఒక ప్రత్యేక గదిని దీనికోసం కేటాయించి, హాస్పిటల్ తరహాలో అత్యాధునిక బెడ్లతో పాటు ప్రథమ చికిత్సకు అవసరమైన అన్ని రకాల అత్యవసర మందులను అందుబాటులో ఉంచుతున్నారు.
అలాగే విద్యార్థులకు ఎప్పకటికప్పుడు వైద్య సేవలు అందించేందుకు స్థానిక ఏఎన్ఎం సేవలను కూడా వినియోగించుకోనున్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే సిక్ రూమ్లకు అవసరమైన వైద్య పరికరాలు, మౌలిక వసతుల సామగ్రిని ఆయా పాఠశాలలకు సరఫరా చేశారు. మరో నెల రోజుల్లో ఈ సిక్ రూమ్లను పూర్తిస్థాయిలో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు వేగంగా చర్యలు చేపడుతున్నారు.

