ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన రీఎంట్రీపై వస్తున్న కథనాలపై వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పష్టత ఇచ్చారు. తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికలు, కార్యాచరణను త్వరలోనే ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రకటిస్తానని స్పష్టం చేశారు.
తనది మొదటినుంచీ స్వతంత్ర భావజాలమని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లేదా ఇతర ప్రభావాలకు లోనయ్యే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా, పూర్తి నిర్భయంతో మరియు ఆత్మగౌరవంతో ముందుకు వెళ్తానని పేర్కొన్నారు.
ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరియు రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి, తిరిగి వైఎస్సార్సీపీలోకి వెళ్తారని లేదా రాష్ట్రంలో టీడీపీ-వైసీపీలకు ప్రత్యామ్నాయంగా ఒక కొత్త రాజకీయ వేదికను లేదా పార్టీని స్థాపించబోతున్నారని పొలిటికల్ వర్గాల్లో విస్తృత ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయంలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

