ఎప్పుడు ఎన్నికలు పెట్టినా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి తిరుగులేదని.. అందుకే గొడ్డలి పార్టీ భయపడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మొగల్తూరు సభలో ఆయన మాట్లాడుతూ..
ఏకగ్రీవం అయితే ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వమని గొడ్డలి పార్టీ నాయకుడు చెబుతున్నారు.. ఏకగ్రీవాలను ప్రభుత్వాలే ప్రోత్సహించాయన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చైర్మన్, మేయర్ల ఎన్నికను ప్రత్యక్షం చేశాం.. ఆయారామ్ -గయారామ్ అనే విధానం లేకుండా 5 ఏళ్ల పాటు కొనసాగేలా ఈ నిర్ణయం తీసున్నామన్నారు. 1996 నుంచి 34 శాతంగా ఉన్న బీసీలకు రిజర్వేషన్లను గొడ్డలి పార్టీ తగ్గించేసింది.. మళ్లీ ఆ రిజర్వేషన్ను అమలు చేసేందుకు ప్రయత్నిస్తుంటే కోర్టుకు వెళ్లారని మండిపడ్డారు.
ఓటర్ల రివిజన్ పూర్తయ్యే వరకూ ఎన్నికలకు వెళ్లొద్దని కోర్టుల్లో కేసులు వేశారు.. ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరక్కుండా అడ్డుకోవటమే గొడ్డలి పార్టీ ఆలోచన అన్నారు. చిత్తు చిత్తుగా ఓడిపోతామనే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు.. స్థానిక ప్రభుత్వాలు ఉంటేనే అభివృద్ధి... అవి లేకపోతే ఎలా.? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు స్థానికంగా వార్డు సభ్యులు, సర్పంచులు ఉండాలి.. అప్పుడే కేంద్రం నుంచి కూడా గ్రామీణ ప్రాంతాలు, స్థానిక సంస్థల అభివృద్ధికి నిధులు వస్తాయన్నారు.
సమాజంలో గొడ్డలి పార్టీ లాంటి కలుషితాన్ని కడిగేయాలని ప్రజలకు పిలుపునిస్తున్నాను.. మంచి ఆలోచనలతో పాటు స్వచ్చమైన వాతావరణం ఉండాలి.. ఎన్నికల్లో డబ్బులు తీసుకునే కలుషితాన్ని కడిగేయాలన్నారు. ఎన్నికల్లో డబ్బులు అనే వ్యవహారం ఇక ముగిసిపోవాలి.. ఆ కలుషితాన్ని అంతా కలిసి కడిగేద్దామన్నారు. ప్రజా పాలనలో సాంకేతికతను కూడా వినియోగించాలని ఏఐ ట్యూటర్, ఆరోగ్యం కోసం ఏఐ డాక్టర్ లాంటి వ్యవస్థల్ని అందుబాటులోకి తెస్తున్నాం.. రాష్ట్రంలోని 1.60 కోట్ల కుటుంబాలకు ఆన్ లైన్ లో సేవలు అందించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని తెలిపారు.

