ఢిల్లీలో తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఆగస్టు 21న ఆమె తన నివాసంలో విగతజీవిగా పడి ఉండగా, తన భర్త, అత్తమామల వేధింపుల వల్లే ఈ దుర్ఘటన జరిగిందని మృతురాలి కుటుంబసభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
మృతురాలిని 30 ఏళ్ల నాజియా ఖాసమ్గా గుర్తించారు. ఈ ఏడాది ఏప్రిల్ 11న అజ్మ్ అలీ ఖాన్తో ఆమె వివాహం జరిగింది. ఎఫ్ఐఆర్ ప్రకారం.. నాజియాను ఆమె భర్త అజ్మ్ అలీ ఖాన్, అత్త సమీన్ నిషా, మామ బాబర్ అలీ ఖాన్తో పాటు మరికొందరు కుటుంబసభ్యులు నిరంతరం మానసికంగా, శారీరకంగా వేధించినట్లు ఆమె తండ్రి తవాబ్ ఖాన్ ఆరోపించారు. తరచూ ఆమెపై దాడి చేస్తూ, ఇంట్లో నుంచి గెంటెస్తామని, చంపేస్తామని బెదిరించేవారని తెలిపారు.
ఈ వేధింపులపై నాజియా పలుమార్లు తమతో ఫోన్లో వాపోయిందని తండ్రి కన్నీటిపర్యంతమయ్యారు. ఆమె మూడు నెలల గర్భిణి అయినప్పటికీ భర్త ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని ఆయన ఆరోపించారు. నాజియాను అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
మరోవైపు, పోలీసులకు భర్త చెప్పిన వివరాల ప్రకారం.. తమ మధ్య గొడవ జరిగిందని, ఆ సమయంలో నాజియా తనను ఒక గదిలో వెనకనుంచి లాక్ చేసి వేరే గదికి వెళ్ళిపోయిందని తెలిపాడు. తాను ఇంటి యజమానికి ఫోన్ చేయగా, ఆయన నిచ్చెన ద్వారా బాల్కనీలోకి వచ్చి తనకు తలుపు తీశారని పేర్కొన్నాడు. ఆ తర్వాత కిటికీలో నుంచి చూడగా నాజియా సీలింగ్ ఫ్యాన్కు చున్నీతో వేలాడుతూ కనిపించిందని భర్త పోలీసులకు వెల్లడించాడు.
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భర్త, అతని బంధువుల వేధింపులు (సెక్షన్ 85), ఆత్మహత్యకు ప్రేరేపించడం (సెక్షన్ 108) వంటి భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సమక్షంలో మృతురాలి కుటుంబసభ్యుల వాంగ్మూలాన్ని రికార్డు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

