హైదరాబాద్ పాతబస్తీలోని పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం మధ్యాహ్నం పెను ప్రమాదం సంభవించింది. జలపల్లి గ్రామ సమీపంలోని ఓ జనసంచారం ఉన్న ప్రాంతంలో ఉన్నట్టుండి రెండు ఆక్సిజన్ సిలిండర్లు ఒకదాని తర్వాత ఒకటి పేలిపోయాయి.
ఈ పేలుళ్ల ధాటికి ఆ ప్రాంతం ఒక్కసారిగా దద్దరిల్లింది. తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే, సిలిండర్లు పేలిన ఇంటితో పాటు పక్కనే ఉన్న గృహాల పైకప్పులు కూడా కుప్పకూలిపోయాయి.
ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు శబ్దానికి భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పహడీ షరీఫ్ పోలీసులు, స్థానికుల సాయంతో క్షతగాత్రులను శిథిలాల నుంచి వెలికితీసి చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నివాస ప్రాంతాల మధ్య ఆక్సిజన్ ట్యాంకులను నిల్వ ఉంచడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఈ పేలుడుకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.

