Dailyhunt
Hyderabad: పైలట్ శిక్షణా విద్యార్థినిపై అత్యాచారం.. వీడియోలతో బెదిరించి..

Hyderabad: పైలట్ శిక్షణా విద్యార్థినిపై అత్యాచారం.. వీడియోలతో బెదిరించి..

హైదరాబాద్‌లోని బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. పైలట్ కావాలనే లక్ష్యంతో శిక్షణ కోసం వచ్చిన ఒక యువతిపై అదే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి అత్యాచారానికి పాల్పడ్డాడు.

కేరళకు చెందిన నసీముద్దీన్ అనే వ్యక్తి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు సదరు యువతికి శిక్షణ ఇస్తానంటూ దగ్గరై, మాయమాటలతో ఆమెను ప్రేమ వలలో దించి ఈ దారుణానికి పాల్పడ్డాడు.

బాధితురాలు అందించిన ఫిర్యాదు ప్రకారం.. 2025 జనవరి నుంచి నిందితుడు ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా, బాధితురాలికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీసి వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరింపులకు గురిచేశాడు. నిందితుడి వేధింపులు మితిమీరిపోవడంతో తట్టుకోలేక బాధితురాలు తన నివాసాన్ని దమ్మాయిగూడకు మార్చుకుంది. అయినప్పటికీ, నిందితుడు ఆమెను వదలకుండా బెదిరింపులు కొనసాగించడంతో, విసుగు చెందిన యువతి తన పైలట్ శిక్షణను మధ్యలోనే ఆపేసింది.

చివరికి ధైర్యం చేసి బాధితురాలు బేగంపేట పోలీసులను ఆశ్రయించింది. తనపై జరిగిన అఘాయిత్యం, ఎదుర్కొన్న బెదిరింపుల గురించి ఫిర్యాదు చేయడంతో పోలీసులు తక్షణమే స్పందించారు. నిందితుడు నసీముద్దీన్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన విద్యా, శిక్షణా సంస్థల్లోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం పట్ల స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu