రాజస్థాన్ రాజధాని జైపూర్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నడిరోడ్డుపై భౌతిక దాడికి తెగబడ్డారు.
జైపూర్లో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు అభిజిత్ దీప్కే వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. నిరసనకారుల ముసుగులో ఒక్కసారిగా దూసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులు.. అందరూ చూస్తుండగానే ఆయన చెంపపై బలంగా కొట్టారు. ఊహించని ఈ పరిణామంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది.
తన నాయకుడిపై కళ్లెదుటే దాడి జరగడంతో అక్కడే ఉన్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్తలు, మద్దతుదారులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. సదరు నిందితులను వెంటనే చుట్టుముట్టి వారిపై మూకుమ్మడిగా తిరగబడ్డారు. దాడికి పాల్పడిన వారిని పట్టుకుని సీజేపీ కార్యకర్తలు చితకబాదారు. ఈ ఘర్షణతో నిరసన ప్రాంతం కాస్తా రణరంగంగా మారింది. సమాచారం అందుకున్న జైపూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. దాడికి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అసలు అభిజిత్ దీప్కేపై దాడి చేయడానికి గల కారణాలు, వారి వెనుక ఉన్న శక్తులపై విచారణ జరుపుతున్నారు. రాజకీయ విరోధమా లేక మరేదైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.

