Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జనసేనకు తెలంగాణ హైకోర్టులో షాక్..సాయంత్రం పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్!

జనసేనకు తెలంగాణ హైకోర్టులో షాక్..సాయంత్రం పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్!

హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో భారీ సభ నిర్వహించాలనుకున్న జనసేన పార్టీకి న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఈ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ జనసేన దాఖలు చేసిన అత్యవసర హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.

ఈ అంశంలో అత్యవసర విచారణ జరపాల్సినంత తీవ్రత లేదని భావించిన రిజిస్ట్రీ.. పిటిషన్‌ను తోసిపుచ్చింది.

అసలేం జరిగింది?

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో 'తెలంగాణ నవనిర్మాణ సభ' పేరిట ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని జనసేన భావించింది. అయితే, రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. గతంలో పవన్ కల్యాణ్ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. ఆయనకు ఇక్కడ సభ పెట్టే హక్కు లేదంటూ అధికార కాంగ్రెస్ శ్రేణులతో పాటు ఇతర పక్షాలు మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటూ పోలీసులు ఈ సభకు అనుమతి నిరాకరించారు.

సాయంత్రం పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్

సభకు అనుమతి దక్కకపోవడంతో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన పార్టీ ముఖ్యనేతలతో కలిసి మీడియా సమావేశం (ప్రెస్ మీట్) నిర్వహించనున్నారు. "సభకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో కనీసం ఈ ప్రెస్ మీట్‌కైనా పోలీసులు సహకరిస్తారని ఆశిస్తున్నాం" అంటూ పవన్ కల్యాణ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు. హైకోర్టు నిర్ణయంతో జనసేన శ్రేణుల్లో నిరాశ వ్యక్తమవగా, సాయంత్రం జరగబోయే మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu