కర్ణాటకలోని మైసూరులో గల ఒక ప్రముఖ బార్ అండ్ రెస్టారెంట్లో సోమవారం సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమవ్వగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఆర్టీ నగర్ ఏరియా రింగ్ రోడ్డులోని దత్తగల్లి సమీపంలో ఉన్న 'ఫాక్స్ డెన్ లిక్కర్ గ్యారేజ్ బార్ అండ్ రెస్టారెంట్'లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్, బార్ ప్రాంగణంలో దాదాపు 25 మందికి పైగా ఉన్నారు. మంటలు క్షణాల్లోనే భవనం అంతటా వ్యాపించడంతో దట్టమైన పొగ కమ్ముకుని లోపల ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో అక్కడే పనిచేస్తున్న డార్జిలింగ్కు చెందిన సాహిన్ (26), నేపాల్కు చెందిన ప్రకాష్ (24) భవనం లోపల చిక్కుకుపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో చిక్కుకున్న ఏడుగురిని సురక్షితంగా రక్షించి, చికిత్స నిమిత్తం సమీపంలోని సుయోగ్, అపోలో ఆసుపత్రులకు తరలించారు. వీరిలో కొందరు మంటల వల్ల గాయపడగా, మరికొందరు ప్రాణాలు కాపాడుకోవడానికి పై అంతస్తు నుండి కిందకు దూకడంతో గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ రెస్టారెంట్లో నిబంధనల ప్రకారం ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించారా లేదా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.

