కేంద్ర ఆర్థిక సేవల విభాగం (DFS) కీలక నిర్ణయం తీసుకుంది. క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తుల వివరాలను ప్రజలు సులభంగా తెలుసుకునేందుకు వీలుగా 'కామన్ ల్యాండింగ్ పోర్టల్'ను అధికారికంగా ప్రారంభించింది.
దేశంలోని 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన 'పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అలయన్స్' భాగస్వామ్యంతో ఈ కేంద్రీకృత పోర్టల్ను అభివృద్ధి చేశారు. దేశ వ్యాప్తంగా చేపట్టిన 'మీ డబ్బు, మీ హక్కు' ప్రోగ్రామ్ కింద దీన్ని అందుబాటులోకి తెచ్చారు.
ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. www.unclaimedassetsportal.in అనే వెబ్సైట్ ద్వారా ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏకీకృత ప్లాట్ఫారమ్ ద్వారా పౌరులు తమకు సంబంధించిన కింది క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తుల వివరాలను ఒకే చోట శోధించవచ్చు:
- బ్యాంకు డిపాజిట్లు
- ఇన్సూరెన్స్ క్లెయిమ్లు
- షేర్లు, డివిడెండ్లు
- మ్యూచువల్ ఫండ్స్
మరింత పారదర్శకమైన, పౌర-కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో ఈ కామన్ ల్యాండింగ్ పోర్టల్ ఒక కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఈ సందర్భంగా ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం. నాగరాజు మాట్లాడుతూ.. వివిధ ఆర్థిక సంస్థల వద్ద ఉన్న వేర్వేరు శోధన సౌకర్యాలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా ఇది పౌరుల సౌకర్యాన్ని ఎంతగానో మెరుగుపరుస్తుందని అన్నారు. ప్రజలకు చెందాల్సిన వారి హక్కుదార్ల ఆర్థిక ఆస్తులను తిరిగి వారికి చేర్చడానికి ప్రభుత్వం చేస్తోన్న నిరంతర ప్రయత్నాలకు ఈ పోర్టల్ మరింత బలాన్ని చేకూరుస్తుందని ఆయన స్పష్టం చేశారు.

