హరీష్ రావు క్షుద్ర పూజలు చేస్తున్నారు.. ఇందులో ఎలాంటి దాపరికం లేదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. గాంధీ భవన్లో ఆయన మాట్లాడుతూ..
హరీష్ రావు స్వార్థం పరాకాష్టకు చేరిందన్నారు. తెలంగాణలో వర్షాలు పడకూడదని, పంటలు పండకూడదని హరీష్ రావు కుట్రలు చేస్తున్నారని అన్నారు. కరువుతో ప్రజలు అల్లాడిపోవాలని హరీష్ రావు కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించారు. సామా రామ్మోహన్, దయాకర్కు నోటీసులు అందులో భాగమేనన్నారు.
హరీష్ రావు క్షుద్ర పూజలు చేశాడని చెప్పడానికి ఉదాహరణలు ఉన్నాయన్నారు. తమిళనాడు తిరుచ్చారాపల్లి, శివ మొగ్గలో క్షుద్ర పూజలు చేసే దేవాలయాలు ఉన్నాయని.. జూన్ 1 ,మే 31, జులై 23న హరీష్ రావు శివమొగ్గ వెళ్లినట్లుగా ఆధారాలు ఉన్నాయన్నారు. మేము చెప్పిన డేట్ ప్రకారం హరీష్ ఎక్కడ ఉన్నారో మీడియాకి సమాధానం చెప్పాలన్నారు. హరీష్ సమాధానం చెప్తే నేను, ముఖ్యమంత్రి సమాధానం చెబుతామన్నారు. వాస్తవాలు మాట్లాడితే నోటీసులు ఇచ్చారన్నారు. శివ మొగ్గ వెళ్ళిన హరీష్ రావు ఫోటోలు ఎందుకు సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు? తిరుపతి మాదిరి శివ మొగ్గలో మీడియా అడ్రస్ ఎందుకు చేయలేదు? క్షుద్ర పూజలు ఎంత వరకు సమంజసం? అని ప్రశ్నించారు.
నవ తెలంగాణ వార్షికోత్సవంలో విమర్శలు, ప్రతి విమర్శలపై సభాముఖంగా కేటీఆర్కి తెలిపాను.. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి అఘోర, తాంత్రిక పూజలు చేయడం ఉందన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో క్షుద్ర పూజల ప్రచారం నమ్మలే.. కానీ హరీష్ రావు వైఖరి చూసి అనుమానాలు వస్తున్నాయన్నారు. పెట్రోల్ పోసుకున్న హరీష్కి అగ్గిపెట్ట దొరకలేదు.. అరుదంతి సినిమాలో పశుపతి మాదిరి హరీష్ వ్యవహారం ఉందన్నారు.

