మహారాష్ట్ర రాజధాని ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ముంబైలోని మంఖుర్ద్ ప్రాంతంలో ఆదివారం (జూలై 5, 2026) రాత్రి మూడు అంతస్తుల భవనం కూలిపోవడంతో..
ఐదుగురు చిన్నారులతో సహా మొత్తం ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారులు తెలిపిన ప్రకారం.. మంఖుర్ద్ లోని జనతా నగర్ చాల్లో ఉన్న మూడు అంతస్తుల నిర్మాణానికి చెందిన ఇల్లు ఆదివారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా కూలిపోయాయి.
సమాచారం అందుకున్న వెంటనే ముంబై ఫైర్ బ్రిగేడ్, పోలీసులు, బీఎంసీ వార్డ్ సిబ్బంది, అంబులెన్స్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల నుంచి గాయపడిన వారిని రక్షించి రాజావాడి, శతాబ్ది ఆసుపత్రులకు తరలించారు. శతాబ్ది ఆసుపత్రికి తరలించిన వారిలో ఒక 32 ఏళ్ల మహిళ, 2 నుండి 14 ఏళ్ల మధ్య వయసున్న నలుగురు పిల్లలు అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. అలాగే రాజావాడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 24 ఏళ్ల యువకుడి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
చెట్లు విరిగిపడి మరో ఇద్దరు మృతి:
మరోవైపు ఆదివారం ముంబైని ముంచెత్తిన భారీ వర్షాల కారణంగా నగరంలో వేర్వేరు చోట్ల చెట్లు కూలి ఇద్దరు వ్యక్తులు మరణించారు. దీంతో జూన్ 30 నుండి ఇప్పటివరకు ముంబైలో చెట్లు కూలిన ఘటనల్లో మరణించిన వారి సంఖ్య మూడుకు చేరింది.
కుర్లా వెస్ట్లోని నౌపడా ప్రాంతంలో ఉన్న హిందీ బీఎంసీ పాఠశాల సమీపంలో మధ్యాహ్నం 12:40 గంటల ప్రాంతంలో ఒక భారీ వృక్షం దుకాణంపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకున్న యునస్ కుందావాలా అనే వృద్ధుడిని వెలికితీసి ఫౌజియా ఆసుపత్రికి తరలించగా, ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ముంబై మేయర్ రీతూ తావ్డే ప్రమాద స్థలాన్ని సందర్శించి, మృతుని కుటుంబానికి రూ. 5 లక్షల తక్షణ ఆర్థిక సాయం ప్రకటించారు.
ఇదే తరహాలో జరిగిన మరొక ప్రమాదంలో.. గోరెగావ్ ఈస్ట్లోని ఆరే కాలనీ పరిధిలో మోటార్ సైకిల్పై వెళ్తున్న 18 ఏళ్ల యువకుడిపై చెట్టు కొమ్మ విరిగిపడటంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

