ప్రముఖ యువ నటి మమితా బైజు అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. సెప్టెంబర్ 5న ఆస్ట్రేలియాలో అత్యంత వైభవంగా జరగాల్సిన 'క్లైడ్ ఓనం 2026' వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది.
అయితే అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో వైద్యుల సలహా మేరకు ఆమె తన ఆస్ట్రేలియా పర్యటనను పూర్తిగా రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని 'క్లైడ్ మలయాళీ అసోసియేషన్' అధికారికంగా ప్రకటించడంతో పాటు, ఓనం వేడుకలను కూడా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.
ఈ మేరకు అసోసియేషన్ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో మమితా బైజు స్వయంగా మాట్లాడుతూ.. అనారోగ్య కారణాల వల్ల, వైద్యుల సూచన మేరకు తాను ప్రయాణం చేయలేకపోతున్నానని, తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన నిర్వాహకులకు, అభిమానులకు క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. త్వరలోనే కోలుకుని తన అభిమానులను కలుసుకుంటానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. నటిగా వరుస విజయాలతో దూసుకుపోతున్న మమితా బైజుకు ఇటీవల కాలంలో క్రేజ్ భారీగా పెరిగింది. ఆమె నటించిన మూడు చిత్రాలు కేవలం నెల రోజుల వ్యవధిలోనే విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించాయి.
ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్' తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలాంటి తరుణంలో ఆమె అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

