హిందూ దేవతలు, పవిత్ర గ్రంథం రామాయణంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్పై తిరుపతి కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది. కేరళ లిటరేచర్ ఫెస్టివల్తో పాటు పలు పబ్లిక్ ఫోరమ్లలో ప్రకాష్ రాజ్ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రసంగించారని ఆరోపిస్తూ బీజేపీ నాయకుడు, టీటీడీ బోర్డు సభ్యుడు జి.
భానుప్రకాష్ రెడ్డి సోమవారం ఫోర్త్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ ఫిర్యాదు చేశారు. రామాయణంలో శ్రీరాముడు, లక్ష్మణుడు ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశంపై 'దండయాత్ర' చేయడానికి వచ్చారని, ఆ దక్షిణ భాగాన్ని ప్రకాష్ రాజ్ 'లంక'తో పోల్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 17న సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్కు సంబంధించిన ఈ వీడియోను తాను చూశానని భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. ఈ వ్యాఖ్యలు పూర్తిగా వాస్తవ విరుద్ధమని, సమాజంలో ప్రాంతీయ విద్వేషాలను రేకెత్తించేలా, దేశ సాంస్కృతిక ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే ఆర్య-ద్రావిడ సిద్ధాంతాన్ని తెరపైకి తెస్తూ హిందూ సమాజంలో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమయ్యారని ఆరోపించారు. ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు మతపరమైన సామరస్యానికి భంగం కలిగించేలా ఉన్నాయని, అందువల్ల భారతీయ న్యాయ సంహిత (BNS) 2023లోని సెక్షన్ 299, సెక్షన్ 196 కింద ఆయనపై చర్యలు తీసుకోవాలని, కోర్టు ఈ ఫిర్యాదును స్వీకరించి నిందితుడిని చట్టప్రకారం శిక్షించాలని ఫిర్యాదుదారు కోర్టును అభ్యర్థించారు.

