Dailyhunt
నీటి భద్రతపై మరో ప్రత్యేక కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం

నీటి భద్రతపై మరో ప్రత్యేక కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు 'నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత' అనే 100 రోజుల ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ప్రజల భాగస్వామ్యంతో జల సంరక్షణను ఒక ఉద్యమంలా చేపట్టాలని పిలుపునిచ్చిన సీఎం, ఏప్రిల్ 6 నుంచి జూలై 14 వరకు ఈ కార్యాచరణ కొనసాగుతుందని ప్రకటించారు. ఈ బృహత్తర యజ్ఞంలో సుమారు 60 వేల మంది సాగునీటి సంఘాల సభ్యులను భాగస్వాములను చేస్తూ, వారికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఏప్రిల్ 6న తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికిలో జరిగే సభతో ఈ కార్యక్రమం అధికారికంగా ప్రారంభం కానుంది.

వర్షాకాలం రాకముందే పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పక్కా షెడ్యూల్‌ను రూపొందించింది. ఏప్రిల్ 15 లోపు పనుల గుర్తింపు, ఆపై అనుమతుల మంజూరు పూర్తి చేసి, జూలై 9 నాటికి క్షేత్రస్థాయి పనులన్నీ ముగించాలని సీఎం ఆదేశించారు. ఇందులో భాగంగా చెరువులు, కాల్వల్లో పూడికతీత, ఫీడర్ ఛానెళ్ల ప్రక్షాళన, గుర్రపుడెక్క తొలగింపు వంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ముఖ్యంగా ప్రతి సాగునీటి సంఘం తమ పరిధిలో 'వాటర్ బడ్జెట్' సిద్ధం చేసుకోవాలని, మైక్రో ఇరిగేషన్‌ను ప్రోత్సహించాలని సూచించారు.

గతేడాది ప్రజా భాగస్వామ్యం వల్ల భూగర్భ జలాలు 2.20 మీటర్ల మేర పెరిగాయని గుర్తుచేసిన సీఎం, ఇప్పుడు అదే స్ఫూర్తితో ప్రస్తుత సగటు లోతును మరో 1.5 మీటర్ల మేర పైకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించారు. అన్నమయ్య జిల్లాలోని 'జలధార' పథకం సాధించిన ఫలితాలను రాష్ట్రవ్యాప్తంగా పునరావృతం చేయాలన్నారు. పోలవరం సహా పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి, రాష్ట్రాన్ని కరవు రహితంగా మార్చడమే తమ ప్రభుత్వ సంకల్పమని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఇరిగేషన్, అటవీ, పంచాయతీ రాజ్ వంటి శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి ఈ 100 రోజుల మిషన్‌ను విజయవంతం చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu