2026 అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అధికారిక ప్రకటన అనంతరం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తన మంత్రివర్గంతో పాటు ఈరోజు తన పదవికి రాజీనామా చేశారు.
ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) జారీ చేసిన ఒక ప్రకటన ప్రకారం.. హిమంత బిస్వా శర్మ లోక్ భవన్కు చేరుకుని, తన రాజీనామాతో పాటు తన మంత్రివర్గం రాజీనామాను కూడా గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యకు సమర్పించారు. గవర్నర్ ఆ రాజీనామాను ఆమోదించారు. అయితే, కొత్త ప్రభుత్వం ఏర్పడి ప్రమాణ స్వీకారం చేసే వరకు హిమంత బిస్వా శర్మను తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు.
మే 11 తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశం ఉందని హిమంత తెలిపారు. కొత్త అస్సాం ప్రభుత్వం ఏర్పాటును వీక్షించేందుకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించారు.
"శాసనసభ పక్ష సమావేశానికి జేపీ నడ్డా, నాయబ్ సింగ్ సైనిలను పరిశీలకులుగా నియమించినట్లు మాకు సమాచారం అందింది. నేను త్వరలో నడ్డాజీతో మాట్లాడతాను. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేయమని ఆయన ఆదేశాలు ఇవ్వగానే, మేము సమావేశాన్ని నిర్వహిస్తాము. శాసనసభ పక్ష నాయకుడు ఎన్నికైన తర్వాతే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది," అని ముఖ్యమంత్రి అన్నారు.
అస్సాం శాసనసభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) అద్భుతమైన విజయం సాధించి, స్పష్టమైన మెజారిటీని కైవసం చేసుకుంది. 126 మంది సభ్యులున్న శాసనసభలో 82 స్థానాలు గెలుచుకున్న బీజేపీ, ప్రతిపక్షాలకు ఘోర పరాజయాన్ని చవిచూపించింది. ఈ విజయం రాష్ట్రంలో పార్టీకి పెరుగుతున్న మద్దతును, ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ నాయకత్వంపై ప్రజలకున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది.

