ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ, వార్డు వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చింది. అయితే కొద్దిరోజుల కిందట వాలంటీర్లు తమకు వేతనాలను పెంచాలంటూ రోడ్డెక్కారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారికి ఓ లేఖ రాసి.. సేవ చేయాలనే ఉద్దేశ్యం ఉన్న వారికే గ్రామ, వార్డు వాలంటీర్ వ్యవస్థలో భాగస్వామ్యులను చేశామని చెప్పుకొచ్చారు. సత్కారాలు ఉంటాయని ప్రకటించారు కూడా..! తాజాగా అందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.
ఉత్తమ పనితీరు కనబరిస్తున్న వాలంటీర్లను ఉగాది రోజున సత్కరించనున్నారు. ఈ సత్కార కార్యక్రమానికి సంబంధించి నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.
ఎలాంటి ఫిర్యాదు లేకుండా ఏడాదికిపైగా సేవలందించినవారికి.. మొదటి కేటగిరీలో 2,18,115 మంది వాలంటీర్లకు 'సేవా మిత్ర' అవార్డు అందజేస్తారు. రెండో కేటగిరీలో 4,000 మంది వాలంటీర్లకు 'సేవా రత్న'అవార్డు ఇస్తారు. మూడో కేటగిరీలో 875 మంది వాలంటీర్లకు 'సేవా వజ్ర'అవార్డు ఇస్తారు.

