ఢిల్లీలో రాపిడో ఆటో రైడ్ సందర్భంగా ఓ మహిళకు తీవ్రమైన చేదు అనుభవం ఎదురైంది. ఆటో నడుపుతూ డ్రైవర్ అసభ్యకర వీడియోలు చూస్తూ, వికృత చేష్టలకు పాల్పడినట్లు అస్సాంకు చెందిన డిజిటల్ క్రియేటర్ సుకన్య దత్తా సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో రాపిడో సంస్థ స్పందించి, సదరు డ్రైవర్ను ప్లాట్ఫారమ్ నుంచి శాశ్వతంగా తొలగించినట్లు ప్రకటించింది.
అస్సాంకు చెందిన సుకన్య దత్తా ఢిల్లీలో రీసెర్చర్గా పనిచేస్తున్నారు. ఆమె రాత్రి 8.48 గంటల ప్రాంతంలో సఫ్దర్జంగ్ నుంచి మోడల్ టౌన్కు వెళ్లేందుకు రాపిడో ఆటో బుక్ చేసుకున్నారు. ప్రయాణం సాఫీగా సాగుతున్న సమయంలో ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆటో ఆగగా.. పక్కనే బైక్పై వెళ్తున్న మరో మహిళ సుకన్యను అప్రమత్తం చేసేందుకు ప్రయత్నించింది. ఆటో డ్రైవర్ తన ఫోన్లో ఏదో అసభ్యకరమైన వీడియో చూస్తున్నట్లు ఆమె సంజ్ఞల ద్వారా తెలిపింది. వెంటనే ఆ డ్రైవర్ తన ఫోన్ను దాచిపెట్టాడు.
అప్పుడు పరిశీలించి చూస్తే డ్రైవర్ అసభ్య వీడియోలు చూస్తూ డ్రైవింగ్ చేస్తున్నట్లు తనకు అర్థమైందని సుకన్య పేర్కొన్నారు. ఇంకా అరగంట ప్రయాణం మిగిలి ఉండటం, ఆ మార్గం తనకు పరిచయం లేకపోవడంతో మధ్యలో దిగిపోకుండా.. రద్దీగా ఉండే ప్రాంతం వచ్చే వరకు అలాగే కూర్చున్నట్లు తెలిపారు. ప్రయాణంలోనే రాపిడో సేఫ్టీ టీమ్ను సంప్రదించి డ్రైవర్ తీరుపై ఫిర్యాదు చేసినా, రైడ్ జరిగే సమయంలో తమకు తక్షణ స్పందన రాలేదని ఆరోపించారు. గమ్యస్థానానికి చేరుకున్నాక డ్రైవర్ను నిలదీయగా.. తాను కేవలం విదేశీ వీడియోలు మాత్రమే చూస్తున్నానని బరితెగించి సమాధానం చెప్పాడని ఆమె తెలిపారు.
ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ సుకన్య ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టగా అది వైరల్గా మారింది. ఈ ఘటనపై రాపిడో సంస్థ స్పందిస్తూ.. డ్రైవర్ అసభ్య ప్రవర్తనపై విచారణ జరిపి ప్లాట్ఫారమ్ నుంచి బ్యాన్ చేశామని తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి ఫిర్యాదులపై మరింత వేగంగా స్పందించేలా తమ భద్రతా విధానాలను మెరుగుపరుస్తామని క్షమాపణలు కోరింది.

