తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ ఇంటి వద్ద ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. 2026 అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో విజయ్ పార్టీ అఖండ మెజారిటీ దిశగా దూసుకుపోతున్న తరుణంలో, ప్రముఖ నటి త్రిష ఆయనను కలవడం చర్చనీయాంశమైంది.
సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో విజయ్ నివాసానికి చేరుకున్న త్రిష, సుమారు గంటన్నర పాటు అక్కడ గడిపారు. తిరిగి వెళ్లేటప్పుడు ఆమె మీడియా ప్రతినిధులకు చిరునవ్వుతో 'విక్టరీ' సింబల్ చూపించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతకుముందు తన 43వ పుట్టినరోజును పురస్కరించుకుని ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం గమనార్హం.
మరోవైపు ఎన్నికల ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని TVK ప్రభంజనం సృష్టిస్తోంది. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన ఈ పార్టీ, 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ఇప్పటికే 110కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన 117 సీట్ల మ్యాజిక్ ఫిగర్కు విజయ్ పార్టీ చేరువలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ అధికార DMK కూటమిని వెనక్కి నెట్టి TVK ముందంజలో ఉంది. స్వయంగా విజయ్ తాను పోటీ చేసిన పెరంబూర్ మరియు తిరుచ్చి ఈస్ట్ స్థానాల్లో భారీ మెజారిటీతో విజయం సాధించడం ఆయన రాజకీయ శక్తిని చాటిచెప్పింది.
ఈ రాజకీయ పరిణామాల మధ్య విజయ్, త్రిషల వ్యక్తిగత విషయాలపై కూడా చర్చ జరుగుతోంది. వీరిద్దరూ గతంలో అనేక హిట్ చిత్రాల్లో కలిసి నటించారు. అయితే, విజయ్ తన భార్య సంగీతతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి త్రిష పేరు తరచుగా వార్తల్లో నిలుస్తోంది. 2025 డిసెంబర్లో వీరు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఆ సమయంలో సంగీత చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ పుకార్లకు ఊతమిచ్చాయి. తాజాగా విజయ్ చారిత్రాత్మక విజయం సాధించిన వేళ త్రిష ఆయన ఇంటికి వెళ్లడం రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

