కేరళలో కొత్తగా ఏర్పాటైన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) ప్రభుత్వం మహిళలు, పిల్లల సంక్షేమం కోసం విప్లవాత్మక నిర్ణయాలకు శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్యార్థినులకు నెల నెలా మూడు రోజుల పాటు రుతుక్రమ సెలవులు (Menstrual Leave) మంజూరు చేయడం ఇందులో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
వి.డి. సతీశన్ నేతృత్వంలోని నూతన ప్రభుత్వ విధానపరమైన ప్రకటనను గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో చదివి వినిపించారు.
గవర్నర్ తన ప్రసంగంలో మాట్లాడుతూ.. విద్యార్థినుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగానే 'ప్రాజెక్ట్ మెన్స్ట్రువల్ డిగ్నిటీ' (రుతుక్రమ గౌరవం) ను తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ కింద విద్యాసంస్థలు, బహిరంగ ప్రదేశాలను మహిళా స్నేహపూర్వకంగా మారుస్తామన్నారు. విద్యార్థినులకు నెలకు మూడు రోజుల వరకు పీరియడ్స్ సెలవులు ఇస్తూనే, వారు చదువులో వెనుకబడకుండా ఉండేందుకు వీకెండ్స్ (వారాంతాల్లో) ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
ఉపాధి రంగంలో కూడా మహిళల కోసం కేరళ ప్రభుత్వం కీలక నిబంధనలను తీసుకువస్తోంది. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్-1961 ప్రకారం నూతన చైల్డ్ కేర్ నిబంధనలను అమలు చేయనున్నారు. దీని ప్రకారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పారిశ్రామిక సంస్థలు, ఐటీ పార్కులు మరియు 50 కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న ప్రతి సంస్థలో సురక్షితమైన, నాణ్యమైన డే-కేర్ సెంటర్లు (డే కేర్ కమ్ క్రెచ్లు) ఏర్పాటు చేయడం తప్పనిసరి కానుంది.
కేరళను దేశంలోనే మొట్టమొదటి "అనాథలు లేని రాష్ట్రం" (Orphan-Free State) గా మార్చడమే లక్ష్యంగా 'అనాథ రహిత కేరళ చొరవ'ను ప్రారంభించనున్నారు. జువైనల్ జస్టిస్ యాక్ట్ ఆధారంగా దత్తత ప్రచారాలను నిర్వహించడంతో పాటు, శిక్షణ పొందిన పెంపుడు కుటుంబాల (Foster Families) వ్యవస్థను బలోపేతం చేయనున్నారు. అలాగే, అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలకు 6 నెలల ప్రసూతి సెలవులు మంజూరు చేయడంతో పాటు, పురుషులతో సమానంగా సమాన వేతనం (Equal Pay) లభించేలా చర్యలు తీసుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాలలో బహిరంగ మరుగుదొడ్ల వసతితో పాటు మహిళలకు శానిటరీ నాప్కిన్లు, పాదరక్షలు మరియు ఇతర అవసరమైన వస్తువులు అందుబాటులో ఉంచనున్నట్లు గవర్నర్ వివరించారు.

