తెలుగు హోం
వ్యాక్సిన్ల తయారీలో భారత్ స్వావలంబన.. ప్రధాని మోదీ

అతితక్కువ కాలంలో రెండు వ్యాక్సిన్లను అభివృద్ది చేసిన భారత్ వ్యాక్సిన్ల తయారీ పంపిణీలో తాను స్వావలంబన సాధించానన్న సందేశాన్ని యావత్ ప్రపంచానికి పంపించిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. కరోనా టీకా తొలి దశలో డాక్టర్లు, నర్సులు, ఆసుపత్రులు, వ్యాక్సినేటర్లు, ఇతర ఫ్రంట్ లైన్ కార్మికులు ఆరోగ్య సిబ్బంది మొత్తానికి వేగంగా టీకాలు వేయగలిగితే తదుపరి దశ వ్యాక్సినేషన్ సాధ్యపడుతుందని మోదీ తెలిపారు.2021 మనకు శుభసంవత్సరం. తక్కువ కాలంలో రెండు మేడిన్ ఇండియా వ్యాక్సిన్లను ప్రారంభించడం ద్వారా కోవిడ్ 19 మహమ్మారిపై పోరాటంలో యావత్ ప్రపంచానకీ భారత్ దారి చూపిందని మోదీ పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్లోని తన సొంత నియోజకవర్గం వారణాసిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వైద్య సిబ్బందితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కార్యకర్తలు కరోనా టీకా తొలి డోస్ తీసుకోవడం ద్వారా దేశ ప్రజల్లో నమ్మకం కలిగించారని ప్రధాని నరేంద్రమోదీ ఆరోగ్య సిబ్బంది, వ్యాక్సినేటర్లపై ప్రశంసల వర్షం కురిపించారు. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం తొలి దశలో స్వచ్చందంగా టీకాలను వేసుకోవడానికి ముందుకు రావడం ద్వారా ఆరోగ్య సిబ్బంది నిర్ణయాత్మకమైన దశకు నాందిపలికారని మోదీ కొనియాడారు.అదే సమయంలో కరోనా టీకా భద్రత, సామర్థ్యంపై ప్రజల్లో ఎన్నో అపోహలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్ అనుమతులపై రాజకీయాలు చేయడం, అనుమానాలు రేకెత్తించేలా వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సరికాదని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు.
శుక్రవారం వారణాసిలో టీకా లబ్దిదారులతో మాట్లాడిన ప్రధాని సాధారణ ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల నెలకొన్న భయాందోళనలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. సంవత్సరం లోపు మన శాస్త్రవేత్తలు దేశానికి రెండు కోవిడ్-19 టీకాలు రూపొందిస్తే హడావుడిగా అనుమతులిచ్చారంటూ రాజకీయాలు చేయడం సరైంది కాదని ప్రధాని సూచించారు. రాజకీయ నాయకులు తమ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటారని కానీ కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో మన శాస్త్రవేత్తలు తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే తాను ముందుకి అడుగులు వేశానని మోదీ వివరించారు.సాధారణ ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల నెలకొన్న భయాందోళనలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ వ్యాఖ్యలను పక్కనబెట్టి టీకా తీసుకున్న ఆరోగ్య సిబ్బంది మన వ్యాక్సిన్ ఫలితం గురించి మంచి మాట చెబితే అది ప్రజల్లో గట్టి సందేశాన్ని పంపుతుందని మోదీ అబిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆస్పత్రి మాట్రన్, నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, డాక్టర్లతో ప్రధాని 30 నిముషాల సేపు మాట్లాడారు.
మోదీతో మాట్లాడిన వారందరూ తమకు వ్యాక్సిన్ వల్ల ఎలాంటి సైడ్ అఫెక్ట్లు రాలేదని వెల్లడించారు. వారణాసి జిల్లా మహిళా ఆస్పత్రి మాట్రాన్ పుష్ప దేవితో తొలుత మోదీ మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్ సురక్షితమైనదన్న నమ్మకం మీకుందా అని ప్రశ్నించారు. దానికి ఆమె టీకా తీసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు.
వ్యాక్సిన్ అంటే ఒక ఇంజక్షన్ తీసుకోవడం లాంటిదే. దీని వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు లేవు. అందరినీ టీకా తీసుకోవాలని నేను చెబుతున్నాను అని ఆమె వెల్లడించారు. వ్యాక్సిన్కి అనుమతులివ్వడం రాజకీయ నేతల పనికాదు..
మోదీ హైదరాబాద్లోని భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వడంపై చెలరేగిన విమర్శల్ని ఈ సందర్భంగా ప్రధాని పరోక్షంగా ప్రస్తావించారు. టీకా విషయంలో రాజకీయాలు చేయడం ఎంత మాత్రమూ తగదని అన్నారు. వ్యాక్సిన్కి అనుమతులివ్వడంపై నేను ఒక్కటే చెబుతాను. శాస్త్రవేత్తలు చెప్పినట్టే చేశాను.
ఇది రాజకీయ నాయకుల పని కాదు అని అన్నారు. వ్యాక్సిన్ త్వరగా అందుబాటులోకి రాకపోవడంతో తాను ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నట్టు మోదీ చెప్పారు. కాగా కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ 20 లక్షల డోసుల్ని భారత్ కానుకగా పంపించడంపై బంగ్లా ప్రధాని షేక్ హసీనా హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు. బంగ్లాదేశ్లో కరోనా కేసులు పెరిగిపోతున్న సంక్షోభ సమయంలో టీకా డోసులు అందడం ఆనందంగా ఉందన్నారు. టీకా పంపిణీకి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు.
related stories
-
ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు ఒక్కరోజే 48,219 మందికి టీకా
-
హైదరాబాద్ ప్రభుత్వ ఆదేశానుసారంగా టీకా
-
తూర్పు గోదావరి సత్య ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స