ఎపిలోని 660 మండలాల్లోని 11 మండలాల్లో ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించలేదు. మిగతా 649 మండలాలకు శుక్రవారం ఎంపీపీ అధ్యక్ష పదవులకు అధికారులు ఎన్నికలు నిర్వహించారు.
ఇందులో కోరం లేకపోవడం, నామినేషన్లు వేయకపోవడం వల్ల 15 మండలాల్లో ఎన్నికను వాయిదా వేశారు. ఎంపీపీ ఎన్నిక నిర్వహించిన 634 మండలాల్లో 621 ఎంపీపీ అధ్యక్ష పదవులను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది.ఆయాచోట్ల వైసిపి ఎమ్మెల్యేలు, ఎమ్.పిలతో వచ్చిన తగాదాల వల్ల కొన్ని ఎన్నికలు ఆగిపోయినట్లు చెబుతున్నారు. టీడీపీ ఐదు చోట్ల సొంతంగా.. పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు చోట్ల జనసేన మద్దతుతో మొత్తంగా ఏడు ఎంపీపీలకే పరిమితమైంది.
జనసేన, సీపీఎం ఒక్కో ఎంపీపీ పదవిని దక్కించుకోగా.. నాలుగు చోట్ల స్వతంత్రులు ఆ పదవులను చేజిక్కించుకున్నారు. కాగా, 639 మండలాల్లో కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక, 619 మండలాల్లో ఉపాధ్యక్ష ఎన్నికలు జరిగాయి. వాయిదా పడిన మండలాల్లో తిరిగి నేడు ఎన్నికలు నిర్వహిస్తారు.

