హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే శత్రు దేశాల నౌకలపై ఇప్పటికే ఆంక్షలు విధించిన ఇరాన్, ఇప్పుడు తన వ్యూహాన్ని మరింత పదును పెట్టింది. ప్రపంచంలోని అత్యంత కీలకమైన సముద్ర మార్గాలలో ఒకటైన 'బాబ్ ఎల్-మందేబ్' జలసంధిని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా తన ప్రత్యర్థులపై ఒత్తిడిని పెంచవచ్చని ఇరాన్ ఉన్నత స్థాయి నాయకత్వం సూచించింది.
ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగర్ గాలిబాఫ్ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ఈ హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ సరఫరా గొలుసు (Global Supply Chain) ఎంత బలహీనంగా ఉందో గుర్తు చేస్తూ.. "ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే చమురు, ఎల్ఎన్జీ (LNG), గోధుమలు, బియ్యం మరియు ఎరువుల ఎగుమతుల్లో బాబ్ ఎల్-మందేబ్ జలసంధి వాటా ఎంత?" అని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యూహాత్మక మార్గం మూసివేత వల్ల ఏ దేశాలు, ఏ కంపెనీలు ఎక్కువగా నష్టపోతాయో ఇరాన్ అంచనా వేస్తోందని ఆయన మాటలు సూచిస్తున్నాయి.
ఇజ్రాయెల్పై 'వేవ్ 93' పేరుతో ప్రతికార దాడులు: సముద్ర మార్గాల్లో హెచ్చరికలు చేస్తూనే, క్షేత్రస్థాయిలో ఇరాన్ దాడులను ఉధృతం చేసింది. ఇరాన్ మరియు దాని మిత్రదేశాల దళాలు 'వేవ్ 93' పేరుతో ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై భారీ దాడులు ప్రారంభించినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ప్రెస్ టీవీ వెల్లడించింది. ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతాల్లోని కీలక సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి.
'ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4' వివరాలు: ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం 'ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4'లో భాగంగా ఈ దాడులు జరిగాయి. హైఫా, వెస్ట్రన్ గెలీలీ, కాఫ్ర్ కన్నా వంటి ప్రాంతాల్లోని ఇజ్రాయెల్ దళాల కదలికలు మరియు సహాయక కేంద్రాలను ఖచ్చితత్వంతో కూడిన క్షిపణులతో దెబ్బతీశారు. ఈ ఆపరేషన్ కోసం ఘన మరియు ద్రవ ఇంధన క్షిపణులు, సుదూర లక్ష్యాలను ఛేదించే గైడెడ్ మిస్సైల్స్ మరియు ఆత్మాహుతి డ్రోన్లను (Suicide Drones) వాడినట్లు సైన్యం ధ్రువీకరించింది.
ప్రతికార చర్యగా ఇరాన్ సమర్థన: గత ఫిబ్రవరి 28న ఇరాన్పై జరిగిన దాడుల్లో ఇస్లామిక్ విప్లవ మాజీ నాయకుడు సయ్యద్ అలీ ఖమేనీ మరియు పలువురు ఉన్నత స్థాయి అధికారులు మరణించిన నేపథ్యంలో, ఈ దాడులను తమ సార్వభౌమాధికార రక్షణ కోసం చేస్తున్న చట్టబద్ధమైన చర్యలుగా టెహ్రాన్ పేర్కొంది. ఇరాన్ ఇంధన వనరులు మరియు పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని శత్రువులు జరిపిన దాడులకు ఇది గట్టి సమాధానమని ఇరాన్ స్పష్టం చేసింది.

