బెంగళూరు: బెంగళూరులో పుట్టినరోజు వేడుకల పేరుతో ఒక యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. యువతికి మత్తుమందు కలిపిన కోల్డ్ డ్రింక్ ఇచ్చి, అపస్మారక స్థితిలో ఉండగా అఘాయిత్యానికి పాల్పడ్డారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.
ఘటన వివరాలు: జూన్ 30న తాలఘట్టపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. సోమశేఖర్ అనే వ్యక్తి తన 'బిలేటెడ్ బర్త్డే' పార్టీకి రావాలని యువతిని ఆహ్వానించాడు. ఆ యువతికి, నిందితుడికి కొన్ని రోజుల క్రితమే పరిచయమైంది. సాయంత్రం 5 గంటలకు ఆ యువతి పార్టీకి వెళ్లగా, అక్కడ సోమశేఖర్తో పాటు మరో నలుగురు స్నేహితులు ఉన్నారు.
కోల్డ్ డ్రింక్లో మత్తుమందు: భోజనం చేసిన తర్వాత, నిందితుల్లో ఒకరు ఆమెకు కోల్డ్ డ్రింక్ ఇచ్చారు. అది తాగిన వెంటనే ఆ యువతికి కళ్లు తిరిగి స్పృహ తప్పింది. తాను సెమీ-కాన్షియస్ స్థితిలో ఉండగా, నిందితుల్లో ఒకరు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆ స్థితిలో ఉండటం వల్ల నిందితుడు ఎవరో ఆమె వెంటనే గుర్తుపట్టలేకపోయింది.
పోలీసుల చర్య: ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కేసులో అమరేష్ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించి, మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితులను విచారిస్తున్నామని, సాక్ష్యాధారాల ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

