ఒక వ్యక్తి తాను రూ. 1.5 కోట్ల విలువైన అపార్ట్మెంట్ కొని, ఆ తర్వాత ఆదాయం ఊహించని విధంగా పడిపోవడంతో ఆర్థికంగా ఎలా చిక్కుల్లో పడ్డాడో సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
తన నెలవారీ జీతం ఇంటి రుణం (EMI) మరియు ఇతర ఖర్చులకు సరిపోక తాను పడుతున్న ఆవేదనను రెడ్డిట్ (Reddit) వేదికగా వెల్లడించాడు.
అసలేం జరిగింది? సుమారు ఏడాది క్రితం తన ఆదాయం బాగున్నప్పుడు ఈ అపార్ట్మెంట్ను కొనుగోలు చేశానని అతను తెలిపాడు. "2024లో నా వార్షిక ఆదాయం రూ. 25 లక్షలు ఉండేది, 2025 నాటికి అది రూ. 32 లక్షలకు పెరిగింది. కానీ, గత రెండు త్రైమాసికాలుగా నా వ్యాపారం బాగా దెబ్బతిన్నది. నా జీతం పూర్తిగా ఇన్సెంటివ్స్ మరియు కమిషన్లపై ఆధారపడి ఉండటంతో, ఇప్పుడు నా చేతికి వచ్చే ఆదాయం కేవలం EMI కట్టడానికే సరిపోతోంది" అని అతను రాసుకొచ్చాడు.
ఆర్థిక ఒత్తిడి: అపార్ట్మెంట్లో చేరిన తర్వాత సొసైటీ మెయింటెనెన్స్ ఛార్జీలు, రిపేర్ల కోసం మరో రూ. 3 లక్షలకు పైగా ఖర్చు చేయాల్సి వచ్చింది. దీనివల్ల తన అత్యవసర నిధి (Emergency Fund) కూడా గణనీయంగా తగ్గిపోయిందని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. తన మ్యూచువల్ ఫండ్స్ మరియు PPF పెట్టుబడులను తాకకూడదని అనుకుంటున్నానని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోవడం లేదని వాపోయాడు. "ఈ ఇల్లు కొనడం నా జీవితంలో తీసుకున్న చెత్త నిర్ణయం అనిపిస్తోంది. ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ను అమ్మడం కూడా కష్టంగా ఉంది" అని అతను తన నిస్సహాయతను వ్యక్తం చేశాడు.
నెటిజన్ల సలహాలు: ఈ పోస్ట్కు స్పందించిన చాలా మంది నెటిజన్లు అతనికి వివిధ సూచనలు ఇచ్చారు. అందులో ఒకరు, "నష్టమైనా సరే, ఆ అపార్ట్మెంట్ను అమ్మేసి ఈ ఒత్తిడి నుండి బయటపడటం మంచిది" అని సలహా ఇచ్చారు.

