కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హొలాల్కెరె పట్టణంలో 23 ఏళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (BAMS) విద్యార్థిని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది.
తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న పుకార్ల వల్ల ఆమె తీవ్ర మానసిక వేదనకు గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
'ఇండియన్ ఎక్స్ప్రెస్' నివేదిక ప్రకారం, మృతురాలిని లిఖితగా గుర్తించారు. ఆమె మల్లాదిహళ్లిలోని రాఘవేంద్ర ఆయుర్వేద కళాశాలలో చదువుతోంది. బసవ లేఅవుట్లోని తన ఇంట్లో ఆమె మృతి చెంది ఉండటం మంగళవారం వెలుగులోకి వచ్చింది.
ఆత్మహత్య లేఖలో సంచలన ఆరోపణలు: తన కళాశాలలోని ఒక అధ్యాపకుడితో తనకు ప్రేమ వ్యవహారం ఉందంటూ వ్యాపిస్తున్న పుకార్ల వల్ల లిఖిత తీవ్రంగా కలత చెందింది. ఈ అసత్య ప్రచారాలు తన ప్రతిష్టను, విద్యా వాతావరణాన్ని దెబ్బతీశాయని ఆమె భావించింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆత్మహత్య లేఖలో సదరు అధ్యాపకుడు, అతని భార్య మరియు కొందరు తోటి విద్యార్థినుల పేర్లను లిఖిత ప్రస్తావించినట్లు సమాచారం. వారు తనను వేధించారని, తన వ్యక్తిత్వాన్ని కించపరిచారని, అందుకే తాను ఈ విపరీత నిర్ణయం తీసుకుంటున్నానని ఆమె లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
తండ్రి ఫిర్యాదు: హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న లిఖిత తండ్రి ఉమాశంకర్ జి.ఎన్. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. తన కుమార్తెకు ఆ లెక్చరర్తో గౌరవప్రదమైన సంబంధం మాత్రమే ఉందని తెలిపారు. అయితే, కొందరు క్లాస్మేట్స్ వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందంటూ పుకార్లు ప్రచారం చేశారని ఆరోపించారు. ఈ అవమానాన్ని భరించలేక తన కుమార్తె తీవ్ర మనోవేదనకు గురైందని, దీనికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు హొలాల్కెరె పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

