కువైట్ సిటీ: కువైట్లో పనిచేస్తున్న 36 ఏళ్ల ఒక అరబ్ ప్రవాసికి తన దైనందిన జీవితంలో ఊహించని షాక్ ఎదురైంది. ఉదయం యథావిధిగా పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి, తన ఫ్లాట్ మొత్తం ఖాళీగా ఉండటం చూసి అతను నిర్ఘాంతపోయాడు.
ఇంట్లో ఫర్నిచర్, బంగారం, విలువైన వస్తువులన్నీ మాయమయ్యాయి.
అసలేం జరిగింది? హవల్లి గవర్నరేట్ పోలీసులకు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, అతను ఉదయం 6:30 గంటలకు పనికి వెళ్ళాడు. సాయంత్రం 4 గంటలకు తిరిగి వచ్చేసరికి ఇంట్లో విలువైన వస్తువులేవీ లేవు. తన భార్య, చిన్నారి కొడుకు కూడా కనిపించలేదు. రాత్రంతా ఆమెకు ఫోన్ చేసినా కలవలేదు. చివరకు రాత్రి 8 గంటల సమయంలో ఆమె నంబర్ నుండి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అందులో తాను కొడుకుతో కలిసి కువైట్ విడిచి వెళ్ళిపోయానని, త్వరలోనే విడాకుల కోసం చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తానని క్లుప్తంగా ఉంది.
భర్త ఆరోపణలు: ఆమె పక్కా ప్రణాళికతోనే ఈ పని చేసిందని భర్త పోలీసులకు చెప్పాడు. అతను పనిలో ఉన్న సమయంలోనే ఇంట్లోని వస్తువులను అమ్మేసి, కొడుకుతో కలిసి ఎయిర్పోర్ట్కు వెళ్లి దేశం దాటిందని అనుమానిస్తున్నాడు. తన అనుమతి లేకుండా కొడుకును దేశం దాటించడంపై అతను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. వారి మధ్య చిన్నపాటి గొడవలు ఉన్నప్పటికీ, ఇలాంటి దారుణమైన పని చేసేంత సమస్యలేవీ లేవని అతను స్పష్టం చేశాడు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి, ఆమె ఎలా దేశం దాటిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

