ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో 500 కిలోల మానవ మాయను (ప్లాసెంటా) స్వాధీనం చేసుకున్నట్లు ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) పేర్కొంది.
మానవ అవయవాల అక్రమ రవాణా కేసులో ముగ్గురు చైనీయులు, ఇద్దరు పాకిస్థానీయులతో సహా మొత్తం ఐదుగురిని అధికారులు అరెస్టు చేశారు.
ఏం జరిగింది? నిందితులు మానవ మాయను 'గొర్రె మాయ'గా నమ్మబలికి, వాణిజ్య అవసరాల కోసం విదేశాలకు తరలిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇస్లామాబాద్లోని పలు ఆసుపత్రుల నుంచి తక్కువ ధరకు (ఒక్కోటి రూ. 800లకు) వీటిని సేకరించి, నిల్వ చేసి, ప్రాసెస్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో రెండు చోట్ల సోదాలు నిర్వహించి నిల్వ ఉంచిన మాయను స్వాధీనం చేసుకున్నారు. మానవ అవయవాల మార్పిడి చట్టం (HOTA 2010) ప్రకారం నిందితులపై కేసులు నమోదు చేశారు. దోషులుగా తేలితే 10 ఏళ్ల జైలు శిక్ష, రూ. 10 లక్షల జరిమానా పడే అవకాశం ఉంది.
మాయ (ప్లాసెంటా) అంటే ఏమిటి? గర్భధారణ సమయంలో తల్లి గర్భాశయంలో ఏర్పడే తాత్కాలిక అవయవం ఇది. బొడ్డుతాడు ద్వారా బిడ్డకు ఆక్సిజన్, పోషకాలను అందిస్తుంది. ప్రసవం తర్వాత ఇది శరీరానికి పనికిరాదు కాబట్టి, వైద్య నిబంధనల ప్రకారం దీనిని 'బయో-మెడికల్ వేస్ట్'గా పరిగణించి 24 గంటల్లోగా శాస్త్రీయంగా ధ్వంసం చేయాలి.
దీనిని దేనికి ఉపయోగిస్తారు? ప్లాసెంటాలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్లు, గాయాలను నయం చేసే గుణాలు ఉంటాయి. అందుకే దీనికి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉంది:
- వైద్యరంగం: ప్రసవానంతర డిప్రెషన్ (Postpartum depression), రక్తహీనత వంటి సమస్యలకు మందుల తయారీలో ఉపయోగిస్తారు.
- సౌందర్య సాధనాలు: కాస్మెటిక్ శస్త్రచికిత్సలు, బ్యూటీ ట్రీట్మెంట్లలో దీనిని ఉపయోగిస్తారు.
- ఆహారం: కొన్ని దేశాల్లో (ముఖ్యంగా చైనా వంటి చోట్ల) దీనిని ఆహారంగా తీసుకునే పద్ధతి కూడా ఉంది. చైనాలో దీనిపై నిషేధం ఉన్నా, బ్లాక్ మార్కెట్లో దీనికి అధిక ధర పలుకుతోంది.

