న్యూఢిల్లీ: దేశ కరెన్సీ తయారీలో విప్లవాత్మక మార్పులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం వాడుకలో ఉన్న కాటన్ బేస్డ్ పేపర్ నోట్లకు బదులుగా, ఎక్కువ కాలం మన్నిక ఉండే 'ప్లాస్టిక్' లేదా 'పాలిమర్' నోట్లను ప్రవేశపెట్టాలని ఆర్బిఐ లక్ష్యంగా పెట్టుకుంది.
మొదటి దశలో భాగంగా ప్రయోగాత్మకంగా 10, 20 రూపాయల నోట్లను ప్లాస్టిక్తో ముద్రించనున్నారు. కరెన్సీ అవసరాలు పెరగడం మరియు నోట్ల ముద్రణ-సంరక్షణ ఖర్చులను తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.
ప్లాస్టిక్ కరెన్సీ ఎందుకు? ప్రస్తుతం భారతదేశంలో కాటన్-లినన్ మిశ్రమంతో నోట్లను తయారు చేస్తున్నారు. ఇవి త్వరగా మురికి అవ్వడం, చిరిగిపోవడం వల్ల 3-4 ఏళ్లకే పనికిరాకుండా పోతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే సుమారు 2,380 కోట్ల మురికి నోట్లను ఆర్బిఐ వెనక్కి తీసుకుంది (ఇందులో ఎక్కువ భాగం 500 రూపాయల నోట్లే). ప్లాస్టిక్ నోట్లు వాటర్ ప్రూఫ్ (నీటిలో నానవు) కావడమే కాకుండా, పేపర్ నోట్ల కంటే 3 నుండి 4 రెట్లు ఎక్కువ కాలం మన్నిక వస్తాయి. అంతేకాకుండా, వీటిని నకిలీ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ఇందులో అత్యాధునిక భద్రతా ఫీచర్లు, ప్రత్యేక ఇంకులు మరియు పారదర్శక విండోలను పొందుపరచవచ్చు.
సాంకేతిక సవాళ్లు అధిగమం - ఏటీఎంలు సిద్ధం: వాస్తవానికి 2012లోనే ప్లాస్టిక్ నోట్ల ప్రయోగాన్ని మొదలుపెట్టాలని భావించినా, అప్పటి సాంకేతిక లోపాల వల్ల ఆ ప్రాజెక్టును నిలిపివేశారు. అయితే, ఇప్పుడు సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందడంతో, కొత్త పాలిమర్ నోట్లను గుర్తించడానికి మరియు లెక్కించడానికి ఏటీఎం యంత్రాలను సులభంగా సిద్ధం చేయవచ్చని ఆర్బిఐ స్పష్టం చేస్తోంది. ఆర్బిఐ బోర్డు సమావేశాల్లో ఈ అంశంపై ఇప్పటికే కీలక చర్చలు జరిగాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ నోట్లు: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 60 దేశాలు పాలిమర్ నోట్లను విజయవంతంగా వాడుతున్నాయి. ఒకవేళ ఆర్బిఐ ఈ పైలట్ ప్రాజెక్టులో విజయం సాధిస్తే, త్వరలోనే మన చేతుల్లోకి చిరగని మరియు తడవని ప్లాస్టిక్ నోట్లు వచ్చే అవకాశం ఉంది.

