స్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఎక్కడ చూసినా వివాహ వేడుకలు కనిపిస్తుంటాయి. అయితే, చాలా సందర్భాల్లో పెళ్లి అనేది రెండు కుటుంబాల మధ్య బంధంలా కాకుండా, భారీగా డబ్బులు చేతులు మారే వ్యాపారంగా మారుతోంది.
అమ్మాయి తల్లిదండ్రులు తమ కూతురు పెళ్లిని ఒక బాధ్యతగా భావించడం, దీన్ని అదునుగా చేసుకుని అబ్బాయి తరఫు వారు అనవసరమైన డిమాండ్లు చేయడం సమాజంలో పెరిగిపోయింది. ఇలాంటి దురదృష్టకరమైన ఘటనే ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో చోటుచేసుకుంది.
అసలేం జరిగింది? ఆగ్రాలోని తాజ్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వివాహం ఎంతో ఘనంగా జరుగుతోంది. బారాత్, ద్వారార్, జైమాల వంటి కార్యక్రమాలు పూర్తయ్యాయి. పెళ్లి పీటల మీదకు చేరి, రెండు అడుగులు (ఫేరే) వేసిన తర్వాత, అకస్మాత్తుగా అబ్బాయి తల్లి తన కొడుకును ఆపమని చెప్పింది. ఆ తర్వాత అబ్బాయి, పెళ్లికూతురు తండ్రిని రూ. 35 లక్షల విలువైన 'పజేరో' కారు కావాలని డిమాండ్ చేశాడు.
వధువు తండ్రి వేడుకోలు: ఇప్పటికే పెళ్లి కోసం రూ. 35 లక్షలు ఖర్చు చేసిన వధువు తండ్రికి, అదనంగా కారు అడగడంతో షాక్ తగిలింది. అంతటి భారీ మొత్తాన్ని ఇవ్వలేనని ఆయన చేతులెత్తి వేడుకున్నా, అబ్బాయి తరఫు వారు వినలేదు. పెళ్లిని ఆపేస్తామని బెదిరించారు. పోలీసులు రంగంలోకి దిగినా ఫలితం లేకపోవడంతో, పంచాయతీ పెట్టి పెళ్లికి అయిన ఖర్చును తిరిగి ఇప్పించాలని నిర్ణయించారు. కానీ అబ్బాయి తరఫు వారు మూడు రోజుల పాటు తిప్పించి, పైగా అమ్మాయి కుటుంబంపైనే తిరిగి పోలీసు కేసు పెట్టారు.
అమ్మాయి తండ్రి పోరాటం: అసలు విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు, అబ్బాయి తరఫు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరిగిన మొత్తం విషయాన్ని వివరించారు. "దోషులకు కఠిన శిక్ష పడాలి, నా కూతురికి జరిగినట్లు మరే ఇతర అమ్మాయికి జరగకూడదు. వరకట్న దురాశాపరుల ఇంటికి నా కూతురు వెళ్లకుండా దేవుడు కాపాడాడు" అని వధువు తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

