పశ్చిమ బెంగాల్: బారుయిపూర్లో ఒక చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాస్ మోండల్, బుధవారం తెల్లవారుజామున పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు.
ఘటనా స్థలంలో విచారణ కోసం, నేరం జరిగిన విధానాన్ని మళ్ళీ సృష్టించే క్రమంలో నిందితుడిని అక్కడికి తీసుకెళ్లారు. ఆ సమయంలో అతను పోలీసుల తుపాకీని లాక్కుని కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడని, దానికి ప్రతిగా పోలీసులు జరిపిన కాల్పుల్లో అతను మరణించాడని బారుయిపూర్ ఎస్పీ (SP) తెలిపారు. చెరువులో చిన్నారి మృతదేహం లభించినప్పటి నుండి ఆ ప్రాంతంలో ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలతో నిరసనలు తెలుపుతున్న తరుణంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది.
ఈ పరిస్థితుల్లో, నిందితుడు ప్రభాస్ మోండల్ తల్లి సంధ్య మోండల్ చేసిన వ్యాఖ్యలు దేశాన్ని ఆశ్చర్యపరిచాయి. ఆమె తన కుమారుడి మృతదేహాన్ని తీసుకునేందుకు నిరాకరించింది. ఏఎన్ఐ (ANI) వార్తా సంస్థతో ఆమె మాట్లాడుతూ, "నా కొడుకు చేసిన ఆ ఘోరమైన నేరానికి అతనికి సరైన శిక్షే పడింది. వాడు ఏనాడు మంచి పని చేయలేదు, అందుకే వాడి మృతదేహాన్ని నేను తీసుకోను, ఇంటికి కూడా తీసుకురాను. పోలీసులు ఆ మృతదేహాన్ని ఏం చేసుకున్నా సరే.." అని తన కుమారుడి చర్యలను పూర్తిగా ఖండిస్తూ, గుండె నిబ్బరంతో స్పష్టం చేసింది.

