సులభంగా డబ్బు సంపాదించి విలాసవంతమైన జీవితాన్ని గడపాలనే ఆశతో, ఢిల్లీకి చెందిన ఒక 21 ఏళ్ల యువకుడు తన తండ్రిపైనే సాయుధ దోపిడీకి ప్లాన్ చేసి, ₹10 లక్షలు దొంగిలించాడు.
బాధితుడి కుమారుడు, నిందితుడైన తవ్లీన్ అలియాస్ రెహత్ తన ఇద్దరు స్నేహితులు మోహిత్ కుమార్ తివారీ (22), పంకజ్ (22) లతో కలిసి ఈ దోపిడీకి స్కెచ్ వేశాడు. ప్రస్తుతం ఈ ముగ్గురినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
పిటిఐ (PTI) వార్తా సంస్థ కథనం ప్రకారం.. తూర్పు ఢిల్లీలోని లక్ష్మీ నగర్ ప్రాంతంలో బాధితుడు తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, మాస్కులు ధరించి స్కూటీపై వచ్చిన తవ్లీన్, మోహిత్ లు అతడిని అడ్డుకున్నారు. స్కూటీ వెనుక కూర్చున్న మోహిత్, బాధితుడిని భయపెట్టడానికి గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. మూడవ నిందితుడు పంకజ్, ఈ దోపిడీ ప్రణాళికను అమలు చేయడంలో చురుగ్గా పాల్గొన్నాడు.
ఈ ఘటన మార్చి 31న జరగగా, లక్ష్మీ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, నిందితులను పట్టుకోవడానికి ఆ ప్రాంతంలోని 200కు పైగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు.
బీహార్కు పారిపోయిన నిందితులు.. ముంగేర్ నుండి తుపాకీ కొనుగోలు
ఈ కేసులో బాధితుడి కుమారుడు తవ్లీన్ ప్రధాన నిందితుడిగా తేలాడని పోలీసులు తెలిపారు. ముఖర్జీ నగర్ నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అతడిని పట్టుకున్నారు. విలాసవంతమైన జీవితం కోసం సులభంగా డబ్బు సంపాదించడానికే తవ్లీన్ ఈ ప్లాన్ వేసినట్లు విచారణలో తెలిసింది.
మిగిలిన ఇద్దరు నిందితులు మోహిత్, పంకజ్ ఆనంద్ విహార్ నుండి ప్రైవేట్ బస్సులో బీహార్కు పారిపోయారు. అయితే, పోలీసులు ఆ బస్సును వెంబడించి లక్నో టోల్ ప్లాజా వద్ద అడ్డుకుని వారిద్దరినీ అరెస్ట్ చేశారు. దోపిడీకి ఉపయోగించిన పిస్టల్ను మోహిత్ బీహార్లోని ముంగేర్ నుండి ₹45,000 కు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దొంగిలించిన నగదు మరియు క్రైమ్ కోసం ఉపయోగించిన స్కూటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదని, తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

