Dailyhunt
SM Krishna Retirement: రాజకీయాలకు సీనియర్‌ నేత గుడ్‌బై.. బీజేపీ లైట్‌ తీసుకుందా..?

SM Krishna Retirement: రాజకీయాలకు సీనియర్‌ నేత గుడ్‌బై.. బీజేపీ లైట్‌ తీసుకుందా..?

NTV Telugu 3 years ago

లేటు వయస్సులోనూ కొందరు నేతలు చక్రం తిప్పుతున్నారు.. పదవుల కోసం పాకులాడుతున్నారు.. పంచాయితీలు కూడా పెడుతున్నారు.. మరికొందరు పార్టీలు మారి..

కొత్త పార్టీలో ఇమడలేకపోతున్నారు.. ఇప్పుడు జరిగిన ఓ పరిణామం చూస్తుంటే.. అదే నిజమా? అనే అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత ఎస్‌ఎం కృష్ణ క్రియాశీల రాజకీయాలకు గుడ్‌బై చెప్పేశారు.. దానికి ప్రధాన కారణం తన ఏజ్‌గా చెప్పుకొచ్చారు.. ఇక, రాజకీయాలకు దూరంగా ఉంటాను అని ప్రకటించిన ఆయన.. 90 ఏళ్ల వయసులో 50 ఏళ్ల వ్యక్తిలా నటించడం సాధ్యం కాదని.. అందుకే ప్రజల్లోకి రావడం కూడా తగ్గించానని చెప్పుకొచ్చారు.. అయితే ఎస్ఎం కృష్ణ రాజకీయ రిటైర్మెంట్ ప్రకటన రాష్ట్ర రాజకీయ రంగంలో ఎలాంటి ప్రభావం చూపేలా కనిపించడం లేదు. ఎస్ఎం కృష్ణ అధికార బీజేపీ పార్టీకి చెందినప్పటికీ బీజేపీ శిబిరం మాత్రం దీనిపై ఆసక్తి చూపడం లేదు. రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న తన నిర్ణయాన్ని కేంద్ర, రాష్ట్ర నేతలకు తెలియజేయాల్సిన అవసరం లేదని ఎస్ఎం కృష్ణ చెప్పడం కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తోంది.

Metro Staff: రోడ్డెక్కిన మెట్రో సిబ్బంది.. జీతాలు పెంపుపై అమీర్ పేట్ లో ధర్నా

బీజేపీ పెద్ద రాజకీయ పార్టీ అని, ఎవరైనా పార్టీని వీడితే నష్టపోయేది లేదన్నారు. అందుకే, రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న నిర్ణయాన్ని కేంద్ర, రాష్ట్ర నేతలకు తెలియజేయాల్సిన అవసరం నాకు కనిపించడం లేదని ఎస్ఎం కృష్ణ పేర్కొన్నారు. అదేవిధంగా ఈ నిర్ణయంతో తన మద్దతుదారులకు పెద్దగా తేడా ఉండదన్న సీనియర్‌ నేత.. వేల మంది ప్రజల నిర్ణయాన్ని ఒక్క వ్యక్తి ప్రభావితం చేయడం సాధ్యం కాదని.. ప్రతి ఒక్కరూ తమ స్వశక్తితోనే జీవితంలో విజయం సాధిస్తారని వ్యంగ్యంగా కామెంట్ చేశారు.. ఇక, ఎస్ఎం కృష్ణ తీసుకున్న ఈ రాజకీయ రిటైర్మెంట్ నిర్ణయాన్ని కాంగ్రెస్ తనదైన రీతిలో నిర్వచించింది. ‘కాంగ్రెస్‌లో అగ్రగామిగా ఉన్న ఎస్‌ఎం కృష్ణను వీధుల్లోకి తీసుకొచ్చి అవమానించిన ఘనత బీజేపీకే దక్కుతుంది. సీనియర్ నేత, మాజీ సీఎం నుంచి పాలనాపరమైన సలహాలు తీసుకునేంత ధైర్యం బీజేపీకి లేదు. బీజేపీకి ఆయన సలహా కూడా అవసరం లేదు. బీజేపీ సిద్ధాంతాలు కృష్ణుడికి అసహ్యమా లేదా కృష్ణుడికే బీజేపీకి అసహ్యం ఉందా?’ అంటూ కాంగ్రెస్‌ పార్టీ ట్వీట్‌ చేసింది..

Coldest Morning: ఉత్తరాదిని వణికిస్తున్న చలి.. ఢిల్లీలో ఈ సీజన్‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

ఇక, ఎస్‌ఎం కృష్ణ బీజేపీలో ఉన్నప్పటికీ బీజేపీ సభ్యుడు కాదని కాంగ్రెస్ పేర్కొంది, మరియు కాంగ్రెస్ యొక్క ఈ వివరణపై బీజేపీ స్పందించకపోవడం ఇప్పటికీ ఆసక్తికరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని గడిపిన ఎస్ఎం కృష్ణ.. కర్ణాటక ముఖ్యమంత్రి, మహారాష్ట్ర గవర్నర్, విదేశాంగ మంత్రి వంటి అనేక ముఖ్యమైన పదవులను నిర్వహించారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీలో కూడా ఎస్ఎం కృష్ణ అనేక కీలక పదవులు నిర్వహించారు. అయితే, పార్టీలో తనను కార్నర్ చేస్తున్నారని మనస్తాపానికి గురైన ఎస్ఎం కృష్ణ 29 జనవరి 2017న కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. కానీ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేదు. ఎన్నికల సమయంలోనే కేంద్ర, రాష్ట్ర నేతలతో కలిసి వేదికలపై కనిపించేవారు. అయితే, ఇప్పుడు ఎస్ఎం కృష్ణ క్రియాశీల రాజకీయాల నుండి రిటైర్మెంట్ ప్రకటించారు, ఆ విధంగా కర్ణాటక రాజకీయ చరిత్రలో అత్యంత ముఖ్యమైన రాజకీయ నాయకులలో ఒకరు తెర వెనుకకు వెళ్లిపోయినట్టు అయ్యింది. మాండ్య జిల్లా మద్దూరులోని రైతు కుటుంబంలో జన్మించిన ఎస్‌ఎం కృష్ణ.. బెంగళూరు, అమెరికాలోని పలు ప్రముఖ యూనివర్సిటీల్లో విద్యనభ్యసించారు. న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. 1962లో మద్దూరు నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరి.. పలుమార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1989 నుంచి 1993 వరకు అసెంబ్లీ స్పీకర్‌గా, అనంతరం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. 1999లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ఎస్‌ఎం కృష్ణ 2004 వరకు ఆ పదవిలో కొనసాగారు. యూపీఏ హయాంలో కేంద్ర విదేశాంగ మంత్రిగా పనిచేసిన ఆయన.. 2017లో బీజేపీలో చేరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu