Dailyhunt
Akhilesh Yadav: ఐప్యాక్‌తో అఖిలేష్ యాదవ్ తెగదెంపులు.. నమ్మకం పోయిందా? భయం పట్టుకుందా?

Akhilesh Yadav: ఐప్యాక్‌తో అఖిలేష్ యాదవ్ తెగదెంపులు.. నమ్మకం పోయిందా? భయం పట్టుకుందా?

NTV Telugu 4 days ago

Akhilesh Yadav: ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సెగ ఇప్పుడు యూపీకి తాకింది.

బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఓటమి, అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యూహాల్లో పెను మార్పులకు కారణమైంది. దీదీ ఓటమీతో ప్రఖ్యాత ఎన్నికల వ్యూహకర్తల సంస్థ ఐప్యాక్ (I-PAC)తో ఎస్పీ తన సంబంధాలను తెంచుకుంది. నిజానికి వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అఖిలేష్ యాదవ్, క్షేత్రస్థాయిలో సర్వేలు, సోషల్ మీడియా నిర్వహణ కోసం ఐప్యాక్‌ను నియమించుకున్నారు. అయితే బెంగాల్, తమిళనాడు ఫలితాల తర్వాత ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.

మమతా బెనర్జీ సూచనతో ఐప్యాక్‌ను నియమించుకున్న అఖిలేష్, అక్కడ టీఎంసీ ఓడిపోవడంతో ఆ సంస్థ వ్యూహాలపై నమ్మకం కోల్పోయినట్లు తెలుస్తోంది. ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు వినేష్ చందేల్‌ను మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడం ఎస్పీ నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేసింది. ఎన్నికల సమయంలో అనవసరమైన రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక అఖిలేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఐప్యాక్ బృందంలో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల వారు ఉండటం వల్ల యూపీ రాజకీయాలపై వారికి పూర్తి అవగాహన లేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ముందస్తు జాగ్రత్తలో అఖిలేష్..
కేవలం రెండున్నర నెలల క్రితమే కుదుర్చుకున్న ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం వెనుక డేటా భద్రత కూడా ఒక కారణం అని విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీకి సంబంధించిన కీలక పత్రాలు, రహస్య సమాచారం లీక్ అయ్యే ప్రమాదం ఉందని భయపడిన అఖిలేష్, ముందుగానే అప్రమత్తమయ్యారని అంటున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన స్థానాలపై ఐప్యాక్ దృష్టి సారించాల్సి ఉండగా, ఇప్పుడు ఆ బాధ్యతలను మార్చేస్తున్నారు.

ఇకపై వ్యూహకర్త ఎవరంటే..
ఐప్యాక్ నిష్క్రమణతో ఎస్పీ తన అంతర్గత బృందం, స్థానిక నాయకులపైనే ఎక్కువ భారం వేయనుందని సమాచారం. ఇప్పటికే డిజిటల్ ప్రచారం, సోషల్ మీడియా బాధ్యతలు చూస్తున్న ‘షో టైమ్’ సంస్థ తన పనిని కొనసాగిస్తుంది. భవిష్యత్తులో ఈ సంస్థ పాత్రను మరింత పెంచే అవకాశం ఉందని సమాచారం. బయటి ఏజెన్సీల కంటే క్షేత్రస్థాయిలో పట్టున్న తన సొంత కార్యకర్తలు, నాయకులను నమ్ముకోవాలని అఖిలేష్ నిర్ణయించుకున్నారు. వీటన్నింటిని గమనిస్తుంటే.. వ్యూహకర్తల కంటే తన సొంత బలగంతోనే 2027లో అధికారంలోకి రావాలని అఖిలేష్ యాదవ్ కృతనిశ్చయంతో ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu