Dailyhunt
AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..

AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..

NTV Telugu 2 weeks ago

AP Weather Alert: రాష్ట్రంలో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

ఒకవైపు తీవ్ర ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. గూడూరు (నెల్లూరు జిల్లా)లో ఈ సీజన్‌లోనే అత్యధికంగా 45.8°C నమోదైంది. అలాగే పిడుగురాళ్ల (పల్నాడు)లో 45.2°C, నందనమారెళ్ల (మార్కాపురం)లో 45°C, రాయలచెరువులో 44.3°C నమోదయ్యాయి. తొర్రగుడిపాడు (ఎన్టీఆర్), వలేటివారిపాలెం (ప్రకాశం)లో 43.6°C, కారంచేడు (బాపట్ల), తవణంపల్లె (చిత్తూరు)లో 43.5°C నమోదయ్యాయి. సంజామల (నంద్యాల)లో 43.2°C, కోడూరు (వైఎస్సార్ కడప)లో 43°C నమోదయ్యాయి. రాష్ట్రంలోని 20 జిల్లాల పరిధిలో 216 మండలాల్లో 41°C పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

మే 1, 2026న వడగాల్పుల హెచ్చరిక జారీ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని 7 మండలాలు, పోలవరం జిల్లాలోని 2 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. మరో 49 మండలాల్లో సాధారణ వడగాలులు ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో 11 మండలాల్లో వడగాలులు తీవ్రంగా ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక రేపటి నుంచి వాతావరణం మారనుంది. ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉంది. రానున్న మూడు రోజులపాటు అకాల వర్షాలు కొనసాగవచ్చని అధికారులు హెచ్చరించారు. పిడుగుల సమయంలో రైతులు, కూలీలు, పశుకాపరులు చెట్ల కింద నిలబడరాదని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu