Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్‌ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!

Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్‌ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!

NTV Telugu 3 days ago

రాన్-అమెరికా మధ్య మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ టెహ్రాన్ వెళ్లేందుకు రెడీ అయ్యారు. రెండు దేశాల మధ్య శాంతి చర్చల్లో భాగంగా కీలక సంప్రదింపుల కోసం గురువారం బయల్దేరి వెళ్తుండగా అకస్మాత్తుగా చివరి నిమిషంలో ప్రయాణం రద్దైంది.

అయితే తమకు మరింత సమయం కావాలని ఇరాన్ కోరడంతో సడన్‌గా అసిమ్ మునీర్ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. దీంతో పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లైంది.

అల్ జజీరా కథనం ప్రకారం.. అమెరికా ఇచ్చిన తాజా ప్రతిపాదనను ఇరాన్ ఇంకా సమీక్షిస్తోంది. ముఖ్యంగా యురేనియం నిల్వలు, హార్ముజ్ జలసంధి భవిష్యత్తు వంటి కీలక అంశాలపై తుది నిర్ణయం తీసుకునే ముందు మరింత సమయం అవసరమని టెహ్రాన్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అసిమ్ మునీర్ పర్యటనను తాత్కాలికంగా నిలిపివేశారు.

ఫిబ్రవరి చివరిలో ప్రారంభమైన అమెరికా-ఇరాన్ యుద్ధం తర్వాత ఏప్రిల్‌లో ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చల్లో కూడా అసిమ్ మునీర్ ప్రధాన పాత్ర పోషించారు. అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య జరిగిన ఆ ప్రత్యక్ష చర్చలకు పాకిస్థాన్ వేదిక కల్పించింది. ఈ సమావేశాలను పాకిస్థాన్ ప్రభుత్వం భారీ దౌత్య విజయంగా ప్రచారం చేసింది. అసిమ్ మునీర్ స్వయంగా రెండు దేశాల ప్రతినిధులను స్వాగతించడం, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో సమావేశమవడం వంటి ఘటనలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.

అయితే చర్చలు ఎలాంటి స్పష్టమైన ఒప్పందం లేకుండానే ముగిశాయి. అమెరికాపై ఇరాన్ "అత్యధిక డిమాండ్లు" చేస్తున్నట్లు ఆరోపించగా.. అమెరికా మాత్రం ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ సైనిక వ్యూహాలపై ఒత్తిడి కొనసాగిస్తోంది.

ఇక తాజా ఉద్రిక్తతలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు మరింత వేడి పుట్టించాయి. "సరైన సమాధానాలు రాకపోతే పరిస్థితులు చాలా వేగంగా మారిపోతాయి. మేమంతా సిద్ధంగా ఉన్నాం" అంటూ ట్రంప్ హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ స్పందిస్తూ.. "చర్చలు జరుగుతున్నప్పటికీ అమెరికా మరో యుద్ధానికి సిద్ధమవుతోంది" అంటూ తీవ్ర విమర్శలు చేశారు. మళ్లీ దాడులు జరిగితే "గట్టిగా ప్రతిస్పందిస్తాం" అని హెచ్చరించారు.

ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి మాట్లాడుతూ.. అమెరికా ప్రతిపాదనను సమీక్షిస్తున్నామని తెలిపారు. అయితే ఆంక్షల ఎత్తివేత, నిల్వలో ఉన్న ఇరాన్ ఆస్తుల విడుదల, అమెరికా నౌకాదళ దిగ్బంధనానికి ముగింపు వంటి డిమాండ్లను మరోసారి ప్రస్తావించారు.

ఇదిలా ఉంటే హార్ముజ్ జలసంధి సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఇంకా ప్రభావం చూపుతూనే ఉంది. ప్రపంచ చమురు, ఎల్‌ఎన్‌జీ సరఫరాలో దాదాపు ఐదో వంతు ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. యుద్ధ సమయంలో ఇరాన్ ఈ జలసంధిపై కఠిన నియంత్రణలు విధించింది. ప్రస్తుతం పరిమిత రవాణాకే అనుమతులు ఇస్తోంది. దీంతో చమురు ధరలు, ఎరువుల సరఫరా, ప్రపంచ ఆహార భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) కూడా హార్ముజ్ సంక్షోభం కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇదే సమయంలో ఇరాన్-గల్ఫ్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కూడా కొనసాగుతున్నాయి.

ఇక ఈ పరిణామాలతో పాకిస్థాన్ మధ్యవర్తిత్వ పాత్రపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సమావేశాలకు వేదిక కల్పించడం, చర్చలకు సహకరించడం వరకు మాత్రమే పాకిస్థాన్ ప్రభావం పరిమితమైందని.. అసలు నిర్ణయాలు మాత్రం అమెరికా, ఇరాన్ చేతుల్లోనే ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన వాయిదా పడటం కూడా అదే విషయాన్ని మరోసారి స్పష్టం చేసినట్లైంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu