Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
BCCI New Rule: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్‌-2కు ముందు.. కొత్త రూల్ తీసుకొచ్చిన బీసీసీఐ!

BCCI New Rule: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్‌-2కు ముందు.. కొత్త రూల్ తీసుకొచ్చిన బీసీసీఐ!

NTV Telugu 2 weeks ago

Smart Glasses Banned in IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకున్న వేళ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లు, మ్యాచ్ అధికారుల కోసం కొత్త నిబంధన అమల్లోకి తీసుకొచ్చింది.

ఇకపై ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్, మ్యాచ్ అధికారులెవరూ స్మార్ట్ సన్‌గ్లాసెస్ లేదా స్మార్ట్ గాగుల్స్ వినియోగించకూడదని బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ (ఏసీఎస్యూ) ఆదేశాలు జారీ చేసింది. ఈ గ్లాసెస్‌లో ఉన్న ఆధునిక కమ్యూనికేషన్ ఫీచర్లు భద్రతాపరమైన సమస్యలకు దారితీయవచ్చని బీసీసీఐ భావిస్తోంది.

బీసీసీఐ విడుదల చేసిన అడ్వైజరీ ప్రకారం.. ప్రస్తుతం కొన్ని కంపెనీలు ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని స్మార్ట్ గాగుల్స్‌ను మార్కెట్ చేస్తున్నాయి. ఈ గ్లాసెస్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేయడం, టెక్స్ట్ మెసేజ్‌లు పంపడం, వీడియో కాల్స్, ఆడియో కాల్స్ చేయడం వంటి సదుపాయాలు ఉంటాయని బీసీసీఐ పేర్కొంది. మొబైల్ డేటా లేదా వైఫై ద్వారా పనిచేసే ఈ పరికరాలను కమ్యూనికేషన్ డివైస్ గానే కాకుండా ఆడియో-వీడియో రికార్డింగ్ డివైస్ గానూ పరిగణిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ప్లేయర్స్, మ్యాచ్ ఆఫీషియల్స్ ఏరియాలో ఈ పరికరాల వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది.

మ్యాచ్ రోజుల్లో స్టేడియంలోకి వెళ్లేముందు ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ తమ మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లతో పాటు ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను కూడా సెక్యూరిటీ లియాజన్ ఆఫీసర్ వద్ద ఉంచాలని ఆదేశించింది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బీసీసీఐ హెచ్చరించింది. ఇటీవల ఐపీఎల్‌లో కొన్ని కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనలు చోటుచేసుకోవడంతో బీసీసీఐ మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన రోమీ భిందర్ మ్యాచ్ సమయంలో డగౌట్‌లో మొబైల్ ఫోన్ ఉపయోగించినందుకు రూ.1 లక్ష జరిమానా విధించడంతో పాటు వార్నింగ్ కూడా జారీ అయింది. ఆ ఘటన తర్వాతే బీసీసీఐ భద్రతా నిబంధనలను మరింత కట్టుదిట్టం చేసింది.

ఇప్పటికే ఆటగాళ్లు రాత్రివేళ అనుమతి లేకుండా బయటకు వెళ్లకుండా బీసీసీఐ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అలాగే భద్రతా కారణాలు, హనీ ట్రాప్ భయాలతో ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్ హోటల్ గదుల్లో అతిథులను అనుమతించడాన్ని కూడా నిషేధించింది. ఇప్పుడు స్మార్ట్ గ్లాసెస్‌పై నిషేధం విధించడం ద్వారా బీసీసీఐ ఐపీఎల్‌లో అవినీతి నిరోధక చర్యలను మరింత బలోపేతం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu