Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!

Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!

NTV Telugu 6 days ago

Carlsberg IPO: భారతీయ ఐపీఓ (IPO) మార్కెట్లోకి మరో గ్లోబల్ దిగ్గజం ఎంట్రీ ఇవ్వడానికి సర్వం సిద్ధం చేసుకుంటోంది. ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన బియర్ బ్రాండ్ 'కార్ల్స్‌బర్గ్' ఇండియా యూనిట్ త్వరలోనే దలాల్ స్ట్రీట్‌లో అడుగుపెట్టబోతోంది.

డెన్మార్క్‌కు చెందిన ఈ మాతృ సంస్థ 'కార్ల్స్‌బర్గ్ A/S', తన భారతీయ వ్యాపార విభాగాన్ని పబ్లిక్ లిస్టింగ్ చేసేందుకు ఈ జూన్ నెలలోనే డ్రాఫ్ట్ పేపర్స్ (DRHP) అప్లై చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

రూ. 6,700 కోట్లు సేకరించే అవకాశం
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ సుమారు 700 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.6,700 కోట్లు) సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుందట. ఈ ప్రతిపాదిత షేర్ల విక్రయం (OFS) కోసం కార్ల్స్‌బర్గ్ సంస్థ.. కోటక్ మహీంద్రా క్యాపిటల్, జేపీ మోర్గాన్ చేజ్, సిటీ గ్రూప్ వంటి ప్రముఖ అంతర్జాతీయ, దేశీయ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్స్‌తో కలిసి పని చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ ఐపీఓ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ఐపీఓ వార్తలపై కార్ల్స్‌బర్గ్ ప్రతినిధులు నేరుగా స్పందించడానికి నిరాకరించారు. అయితే షేర్ హోల్డర్ల విలువను పెంచడానికి ఐపీఓతో సహా అన్ని రకాల మార్గాలను పరిశీలిస్తున్నామని, కానీ ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని కంపెనీ పేర్కొంది. కాగా భారతదేశంలో వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ, మారుతున్న జీవనశైలి కారణంగా ఇక్కడ మద్యం వినియోగం భారీగా పెరుగుతోంది. దీంతో గ్లోబల్ బ్రాండ్స్ అన్నీ ఇండియాలో తమ బిజినెస్ వాల్యూను అన్‌లాక్ చేయడానికి ఆసక్తి చూపుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కార్ల్స్‌బర్గ్‌తో పాటు అబ్సల్యూట్ వోడ్కా, చివాస్ రీగల్ స్కాచ్ విస్కీ తయారీ సంస్థ 'పెర్నాడ్ రికార్డ్' (Pernod Ricard) కూడా ఇండియన్ మార్కెట్లో లిస్టింగ్ అయ్యే ఆలోచనలో ఉంది.

భారతదేశంలో రెండో అతిపెద్ద బియర్ కంపెనీ!
డెన్మార్క్‌లో కార్ల్స్‌బర్గ్ సంస్థను 1847లోనే స్థాపించారు. అంటే ఈ సంస్థకు దాదాపు 180 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. భారత మార్కెట్లోకి ఈ కంపెనీ 2007లో ప్రవేశించింది. ప్రస్తుతం భారతదేశంలో సుమారు 22 శాతం మార్కెట్ వాటాతో కార్ల్స్‌బర్గ్ ఇండియా దేశంలోనే రెండో అతిపెద్ద బియర్ తయారీ సంస్థగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఈ కంపెనీకి 14 బ్రూవరీస్ (మద్యం తయారీ కేంద్రాలు) ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో దీనికి ప్రధాన పోటీదారు అయిన 'యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్' (UBL) మార్కెట్ విలువ ప్రస్తుతం 3.6 బిలియన్ డాలర్లుగా ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu