Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Chanakya Niti: ఎంత కోపం వచ్చినా ఇలా కంట్రోల్ చేసుకోండి.. చాణక్యుడి 5 విజయ మంత్రాలు ఇవే!

Chanakya Niti: ఎంత కోపం వచ్చినా ఇలా కంట్రోల్ చేసుకోండి.. చాణక్యుడి 5 విజయ మంత్రాలు ఇవే!

NTV Telugu 1 week ago

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన చాణక్యనీతిలో మనిషి జీవితానికి సంబంధించిన ఎన్నో విలువైన విషయాలను వివరించారు. అందులో ముఖ్యమైనది కోపాన్ని నియంత్రించడం.

కోపం అనేది మనిషి ఆలోచనా శక్తిని తగ్గించి, తప్పు నిర్ణయాలకు దారి తీస్తుందని చాణక్యుడు పేర్కొన్నారు. ఒకసారి చంద్రగుప్తుడు ఆచార్య చాణక్యుడిని అడిగాడు.. "గురుదేవా.. యుద్ధరంగంలో శత్రువులను ఓడించగలను. కానీ నా లోపల పుట్టే కోపాన్ని మాత్రం అదుపు చేయలేకపోతున్నాను. చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుంది. ఆ సమయంలో నేను ఏం మాట్లాడుతున్నానో, ఎవరితో మాట్లాడుతున్నానో కూడా మర్చిపోతాను. తర్వాత బాధపడినా అప్పటికే ఆలస్యం అయిపోతుంది" అని అన్నాడు.

దీనికి చాణక్యుడు సమాధానమిస్తూ.. "కోపం అనేది మొదట దాన్ని కలిగిన వ్యక్తినే కాల్చే అగ్ని లాంటిది. దానిని అర్థం చేసుకుంటే నియంత్రించడం సాధ్యమే" అని చెప్పినట్లు నీతి శాస్త్రంలో పేర్కొన్నారు. చాణక్యనీతి ప్రకారం.. కోపంలో మాట్లాడిన మాటలు ఎదుటి వ్యక్తి మనసుపై గాయాన్ని మిగులుస్తాయి. తర్వాత క్షమాపణ చెప్పినా ఆ బాధ పూర్తిగా పోదు. అందుకే నిజమైన విజయం ఇతరులను ఓడించడంలో కాదు.. ముందుగా తనపై తాను నియంత్రణ సాధించడంలో ఉందని ఆయన సూచించారు.

కోపాన్ని నియంత్రించేందుకు చాణక్యుడు చెప్పిన 5 సూత్రాలు ఇవే..

1. ముందుగా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి: కోపం వచ్చిన వెంటనే స్పందించకుండా కొంత సమయం మౌనంగా ఉండాలి. దీర్ఘంగా శ్వాస తీసుకోవడం లేదా ఆ పరిస్థితి నుంచి కాస్త దూరంగా వెళ్లడం మంచిది.

2. మాటలపై నియంత్రణ ఉండాలి: కోపంలో మాట్లాడిన మాటలను తిరిగి తీసుకోలేం. కాబట్టి మాట్లాడే ముందు ఆ మాట అవసరమా? లేదా అని ఆలోచించాలి.

3. వ్యక్తిపై కాదు.. సమస్యపై దృష్టి పెట్టాలి: ఎదుటి వ్యక్తిని నిందించడం కంటే, సమస్యకు కారణాన్ని అర్థం చేసుకుని పరిష్కారం కోసం ప్రయత్నించాలి.

4. కోపాన్ని శక్తిగా మార్చుకోవాలి: కోపాన్ని ప్రతికూల భావనగా కాకుండా లక్ష్య సాధనకు ఉపయోగించుకోవాలి. కష్టపడి పనిచేసే శక్తిగా మార్చుకోవాలి.

5. ప్రశాంతంగా ఉన్నప్పుడే నిర్ణయం తీసుకోవాలి: కోపంలో తీసుకునే నిర్ణయాలు చాలాసార్లు తప్పుగా మారుతాయి. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి.

కోపం వల్ల కలిగే నష్టాలు ఇవే..

* మానసిక ఒత్తిడి, అశాంతి పెరుగుతుంది

* బంధాలు దెబ్బతింటాయి

* ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది

* తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంటుంది

* వ్యక్తిగత గౌరవం, ప్రతిష్ఠ తగ్గుతుంది

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu